మరో జర్నలిస్ట్: మొహాలిలో జేకె సింగ్ సహా అతని తల్లి హత్య..
గుర్తు తెలియని దుండగులు సీనియర్ జరల్నిస్ట్ జేకె సింగ్ సహా అతని తల్లి గురుచరణ్ కౌర్(92)ని హత్య చేశారు.
న్యూఢిల్లీ మొహాలిలో జంట హత్యలు చోటు చేసుకున్నాయి. గుర్తు తెలియని దుండగులు సీనియర్ జరల్నిస్ట్ జేకె సింగ్ సహా అతని తల్లి గురుచరణ్ కౌర్(92)ని హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆయన నివాసం వద్దే దుండగులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
శనివారం మధ్యాహ్నం సింగ్ను కలుసుకునేందుకు ఓ వ్యక్తి ఆయన ఇంటికి వచ్చినట్లు సమాచారం. అయితే ఎంతకీ వారు తలుపు తీయకపోవడంతో.. అనుమానం వచ్చిన అతను పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని లోపలికి వెళ్లి పరిశీలించారు.
ఇంట్లో సింగ్ అతని తల్లి రక్తపు మడుగులో పడి ఉండటం పోలీసులు గుర్తించారు. ఇద్దరి మృతదేహాలు పక్కపక్కనే పడి ఉన్నాయి. ఘటన తర్వాత సింగ్ కారు కనిపించకుండా పోయిందని పోలీసులు తెలిపారు.
జేకె సింగ్ గతంలో 'ది ఇండియన్ ఎక్స్ప్రెస్' ఎడిటర్గా పనిచేశారు. శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ జేకె సింగ్ హత్యను ఖండించారు. హంతకులను పోలీసులు తక్షణమే పట్టుకోవడానికి ప్రయత్నించాలన్నారు.
కాగా, కర్ణాటకలో సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య ఇంకా మరిచిపోకముందే మరో జర్నలిస్ట్ ఇలా హత్యకు గురవడం పలు అనుమానాలకు తావిస్తోంది.