డీకే అరెస్ట్ సరే..సుజనా చౌదరి మాటేంటీ: బీజేపీలో చేరగానే కేసులు కోల్డ్ స్టోరేజీలో పెట్టారా?రాజ్ దీప్
న్యూఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి డీకే శివకుమార్ అరెస్ట్ వ్యవహారం పట్ల ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ అసహనాన్ని వ్యక్తం చేశారు. మనీ లాండరింగ్ కేసులో డీకే శివకుమార్ ను అరెస్టు చేయడం హర్షించదగ్గ పరిణామమే అయినప్పటికీ.. కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ మాజీ నాయకుడు సుజనా చౌదరి కేసుల సంగతి ఏమైందని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. లోక్ సభ ఎన్నికల సమయంలో కేసులను ఎదుర్కొన్న సుజనా చౌదరి.. భారతీయ జనతాపార్టీలో చేరగానే పునీతుడయ్యారా? అని ప్రశ్నించారు.
ఒక్క సెకెన్ తేడా వచ్చినా..: ఇస్రో హిస్టరీలోనే అత్యంత కీలక దశ: మాజీ ఛైర్మన్
మనీ లాండరింగ్ కేసులో డీకే శివకుమార్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కార్యాలయం అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కర్ణాటక కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలను చేపట్టింది. కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చింది. రాజకీయ కారణాలతోనే కేంద్ర ప్రభుత్వం డీకే శివకుమార్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులను ప్రయోగించిందని ఆరోపించింది. ఇదే విషయంపై రాజ్ దీప్ సర్దేశాయ్ సైతం స్పందించారు. డీకే శివకుమార్ అరెస్టు వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే అర్థం వచ్చేలా ఆయన ట్వీట్ చేశారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులను ఎదుర్కొన్న కేంద్రమాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీకి చెందిన సుజనా చౌదరి కేసుల సంగతి ఏమైందని ప్రశ్నించారు.
DK Shivakumar arrested: good! But would love to know what happened to another high profile Neta, TDP’s union minister YS Chowdhary, raided and summoned by CBI, ED and IT during elections. The moment he joined BJP, case seems to have gone into cold storage! Yeh hai ‘new’ India!
— Rajdeep Sardesai (@sardesairajdeep) September 3, 2019
లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో సుజనా చౌదరిపై ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులు దాడులు చేయడం, ఆయనకు సమన్లను జారీ చేయడం, కేసులు నమోదు చేయడం వంటి పరిణామాలను రాజ్ దీప్ సర్దేశాయ్ తన ట్వీట్ లో పొందుపరిచారు. ఎన్నికలు ముగిసిన కొద్దిరోజుల్లోనే సుజనా చౌదరి భారతీయ జనతాపార్టీలో చేరిన ఉదంతాన్ని ఆయన ప్రస్తావించారు. సుజనా చౌదరి బీజేపీలో చేరడంతో.. ఆయనపై నమోదైన కేసులు ఎత్తేసినట్లు ఉందని అన్నారు. ఆయనపై పెట్టిన కేసులను వాటిని కోల్డ్ స్టోరేజీలో పెట్టారా? అని నిలదీశారు. సరికొత్త భారత్ అంటే ఇదేనా? అని ప్రశ్నించారు.