జగన్ కోసం అన్నంత పని చేశాడు -ఎమ్మెల్యే పదవికి మల్లాడి రాజీనామా -సీఎం, స్పీకర్ నో
ఏపీ సీఎం జగన్ వీరవిధేయుడు మల్లాడి కృష్ణారావు తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశారు. ఇదివరకు మంత్రి పదవీకి రిజైన్ చేసిన సంగతి తెలిసిందే. మరికొద్దిరోజుల్లో ఎన్నికలు ఉండగా.. నారాయణ స్వామి ప్రభుత్వాన్ని గుక్కతిప్పుకోకుండా చేశారు. మల్లాడి రాజీనామాతో సీఎం నారాయణ్స్వామి ప్రభుత్వం ప్రమాదంలో పడింది. ఉత్కంఠభరిత పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి.
33 మంది సభ్యులు
పుదుచ్చేరి ప్రభుత్వంలో మొత్తం 33 (నామినేటెడ్తో కలిపి) మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గతంలో మంత్రి నమశిశ్వాయం, మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే తెపైంతన్ రాజీనామాలు చేయగా, మరో సభ్యుడు ధనవేలుపై అనర్హత వేటు పడింది. ఇప్పుడు కృష్ణారావు రాజీనామాతో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 29కి చేరింది. ప్రస్తుత ప్రభుత్వానికి 15 మంది (కాంగ్రెస్ 11, డీఎంకే 3, స్వతంత్రులు ఒకరు) ఎమ్మెల్యేల బలం ఉంది. ప్రతిపక్షాల బలం 14 (ఎన్ఆర్ కాంగ్రెస్ 7, ఏఐఏడీఎంకే 4, నామినేటెడ్ 3) ఉంది.
ఏ క్షణం ఎం జరుగుతుందో..
ప్రభుత్వ బలం బార్డర్లో ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఉత్కంఠ ఏర్పడింది. ఒక స్వతంత్రుడిని ప్రతిపక్షం లాగేసుకుంటే ప్రభుత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అయితే పుదుచ్చేరి ప్రభుత్వాన్ని కూల్చివేయాలని ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
25 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా..
పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశారు. గతనెలలో మంత్రి పదవికి రాజీనామా చేసిన కృష్ణారావు తాజాగా యానాం శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో ప్రభుత్వం ప్రమాదంలో కురుకుపోయింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన మల్లాడి కృష్ణారావు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని యానాంకు 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా సేవలు అందిస్తున్నారు. పుదుచ్చేరిలో అనేక పదవులను సైతం చేపట్టారు. గత నెల 7వ తేదీన కృష్ణారావు మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామాను స్పీకర్ ఆమోదించకపోవడంతో తాజాగా ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు సోమవారం వెల్లడించారు.
పోటీ చేయను.. జగన్ కింకర్తవ్యం
ఇకపై ఏ ఎన్నికలలో పోటీ చేయనని, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు గత నెలలో కృష్ణారావు ప్రకటించారు. కొత్త వారికి అవకాశం ఇవ్వాలని.. ఇతర మార్గాల్లో ప్రజలకు సేవ చేస్తానని కృష్ణారావు తెలిపారు. తాజాగా ఆయన నిర్ణయంతో వీ. నారయణస్వామి ప్రభుత్వం ప్రమాదంలో పడింది. అయితే అంతకుముందు ఏపీ సీఎం జగన్ను కృష్ణారావు పొగిడారు. తనకు ఏ పదవీ వద్దు అని.. జగన్ సేవలో తరిస్తానని చెప్పారు. ఇప్పడు రాజీనామా చేయడంతో.. జగన్ కింకర్తవ్యం ఏంటి అనే చర్చ జరుగుతుంది.