దినకరన్ ఎఫెక్ట్, శశికళకు ఎసరు: పళనికి చిక్కు, పన్నీరు వైపు అడుగులు!
అన్నాడీఎంకే అధినేత్రి శశికళ జైలుకు వెళ్లిన తర్వాత ముఖ్యమంత్రి పళనిస్వామికి దినకరన్ చిక్కులు వచ్చి పడ్డాయి.
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి శశికళ జైలుకు వెళ్లిన తర్వాత ముఖ్యమంత్రి పళనిస్వామికి దినకరన్ చిక్కులు వచ్చి పడ్డాయి. దినకరన్ దూకుడుతో ముఖ్యమంత్రి పళనిస్వామి, పలువురు మంత్రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. దినకరన్ తీరుతో పళని తలపట్టుకుంటున్నారు.
రెండాకుల కోసం రూ.50 కోట్లు.. ఎలా బయటపడింది?: ఎవరీ దినకరన్?
తాజా పరిణామాలు అన్నాడీఎంకేలో మరో సంక్షోభాన్ని తీసుకు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మంత్రులు దినకరన్ను టార్గెట్ చేసుకున్నారు. పలువురు సీనియర్ నేతలు శశికళ, నటరాజన్లకు పదవులు వదిలేయాలని అల్టిమేయం కూడా జారీ చేశారు.
దినకరన్ ఎఫెక్ట్.. చిక్కుల్లో పళని, పన్నీరు హ్యాపీ
తమిళనాడు రాజకీయాలలో మళ్లీ అనిశ్చితి మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పళనిస్వామి ప్రభుత్వం ఎన్నాళ్లు ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో మరోవైపు ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోలేక నిరాశలో ఉన్న పన్నీర్ సెల్వం క్యాంపులో మళ్లీ ఉత్సాహం మొదలైంది.
పళనిస్వామికి షాకిచ్చేందుకు..
జూన్ నెలలో పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్ స్మారకార్థం భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాటిలో సెమినార్లు, డిబేట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఈ పేరుతో అటు పళనిస్వామి వర్గం నుంచి చీలిక తీసుకురావాలని పన్నీర్సెల్వం వర్గం భావిస్తోంది.
దినకరన్తో శశికళకు షాక్
శశికళ వర్గం కూడా పళనిస్వామి మీద అసంతృప్తితో ఉండటం లాంటివి పన్నీర్కు కలిసొచ్చే అంశాలు అని చెబుతున్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికను ఎన్నికల కమిషన్ వాయిదా వేయడం, ఆ తర్వాత రెండాకుల గుర్తు కోసం దినకరన్ ఏకంగా ఎన్నికల కమిషన్కే లంచం ఇవ్వడానికి యత్నించినట్లు వెలుగులోకి రావడం లాంటి పరిణామాలతో శశికళ క్యాంపు ఖంగుతిన్నది.
శశికళ క్యాంపులో చీలిక మొదలు...
శశికళ క్యాంపులో చీలికలు రావడం, ఆదాయపన్ను శాఖ దాడులు లాంటి విషయాలు ప్రభుత్వంలో అస్థిరతకు కారణమయ్యాయని పన్నీర్ సెల్వం వర్గం భావిస్తోంది. సీనియర్ నాయకుడు మధుసూదనన్, మాజీమంత్రి పాండ్యరాజన్, ఎంపీ వి మైత్రేయన్, మాజీ మంత్రి మునుసామి, మాజీ ఎమ్మెల్యే జేసీడీ ప్రభాకర్, మాజీ స్పీకర్ పాండియన్ లాంటివాళ్లంతా కలిసి పన్నీర్ సెల్వంతో సమావేశమయ్యారు.
ప్రకటన వెలువడే అవకాశం
వ్యూహాల గురించి చర్చించేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారని, బహుశ రెండు రోజుల్లో పెద్ద ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. శశికళ వర్గం నుంచి కొందరు సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు పన్నీరుసెల్వం వర్గంలో చేరే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
శశికళ ఉండవద్దు..
శశికళ కుటుంబ సభ్యులు పార్టీలో ఉండకూడదని పన్నీర్సెల్వం వర్గం చెబుతోంది. తాజా పరిణామాలపై వ్యాఖ్యానించేందుకు సీనియర్ నాయకుడు మైత్రేయన్ నిరాకరించారు. నాయకులు రావాలనుకుంటే వస్తారని, వాళ్లు రావాలని తాము ఎదురు చూడట్లేదన్నారు. వాళ్ల విషయం వాళ్లే నిర్ణయించుకుంటారన్నారు.