ఈగోలకు పోతున్న పైలట్లు: ప్రయాణికుల జీవితాలతో ఆటలా..? డీజీసీఏ ఏం చెప్పింది..?
కొచ్చి: ఏడాదిన్నర క్రితం ఓ ఎయిరిండియా విమానం కొచ్చి విమానాశ్రయం ల్యాండ్ అవుతున్న సమయంలో పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లిన సంగతి గుర్తు ఉండే ఉంటుంది. ఆ ఘటనకు కారణం వాతావరణ పరిస్థితి అని ఆ సమయంలో అంచనా వేశారు. కానీ అసలు సంగతి విచారణ తర్వాత బయటపడింది.
పిల్ల కాలువలోకి దూసుకెళ్లిన ఎయిరిండియా విమానం
18 నెలల క్రితం ఎయిరిండియాకు చెందిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం 452 అబుదాబి నుంచి కొచ్చికి వచ్చింది. ఆ సమయంలో కొచ్చిలో భారీవర్షం కురుస్తోంది. విమానం రన్వేపై ల్యాండ్ అయితే అయ్యింది గానీ... పక్కనే ఉన్న పిల్లకాలువలోకి దూసుకెళ్లింది. ఏదో భారీ వర్షాల కారణంగా రన్వే సరిగ్గా కనిపించక విమానం పక్కదారి పట్టిందని అంతా అనుకున్నారు. కానీ విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. ల్యాండింగ్ సమయంలో సీనియర్ పైలట్ తన సహచర మహిళా పైలట్ సలహాలు సూచనలు తీసుకోకపోవడంతోనే విమానం కాలువవైపు వెళ్లినట్లు విచారణలో వెల్లడైంది.
వేర్వేరు ఉద్యోగాలు.. ఒకే పరీక్ష: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కొత్త బోర్డు ఏర్పాటుకు కేంద్రం ప్లాన్
మహిళా కో పైలట్ సలహాలను తీసుకోని సీనియర్ పైలట్
సెప్టెంబర్ 2, 2017లో జరిగిన ఈ ఘటనలో విమానంలోని ముగ్గురు ప్రయాణికులకు గాయాలు కాగా విమానం పెద్ద ఎత్తున్న డ్యామేజ్ అయ్యింది. ముందున్న ల్యాండింగ్ గేర్ పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదానికి కారణం కమాండింగ్ పైలట్ వయస్సులో 30 ఏళ్లు తక్కువగా ఉన్న మహిళా పైలట్ ఇచ్చిన సూచనలు తీసుకోకపోవడమే అని డైరెక్టొరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణలో తేలినట్లు వెల్లడించింది. సీనియర్ అయిన పైలట్.. అనుభవంలో వయస్సులో తక్కువ అయిన మహిళా పైలట్ సూచనలు పాటించడమేంటి అని భావించడంతోనే ప్రమాదం జరిగిందని డీజీసీఏ పేర్కొంది.
రాకముందే విమానంను టర్న్ చేసిన పైలట్
అప్పటికే కొచ్చి విమానాశ్రయంలో భారీ వర్షం కురుస్తుండటంతో రన్వేపై ఉన్న మార్కింగ్స్ సరిగ్గా కనిపించలేదు. అయితే విమానం వేగం తగ్గించాల్సిందిగా సహచర మహిళా కోపైలట్ కమాండింగ్ పైలట్ను కోరింది. అంతేకాదు రన్వే సరిగ్గా కనిపించని పరిస్థితుల్లో విమానంను గైడ్ చేసే వాహనంను అరేంజ్ చేయాల్సిందిగా విమానాశ్రయ అధికారులను కోరమని ఆమె కమాండింగ్ పైలట్కు సూచించింది. ఈ సూచనలను కమాండిగ్ పైలట్ వినిపించుకోలేదని విచారణలో వెల్లడైంది. రన్వేపై మలుపు దగ్గరకు చేరుకోక 90 మీటర్ల ముందే పైలట్ విమానంను మళ్లించడంతో నేరుగా అది పక్కనే ఉన్న డ్రెయిన్లోకి దూసుకెళ్లింది. గుంతలో ఇరుక్కున్న విమానంను బయటకు తెచ్చేందుకు ఇంజిన్కు పవర్ ఇచ్చే త్రోటల్ను పైలట్ మూడుసార్లు అప్లై చేశారు. త్రోటల్ అప్లై చేయొద్దని మహిళా పైలట్ చెప్పినప్పటికీ వినలేదని డీజీసీఏ పేర్కొంది. ఇక్కడే ఇద్దరి పైలట్లకు చెడిందని నివేదిక పేర్కొంది.
పైలట్ల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం, వయస్సులో భారీ వ్యత్యాసం, అనుభవంలో తేడా ఉండటం వల్ల సీనియర్ పైలట్ల ఈగో దెబ్బతింటోందనే విషయం విచారణలో వెల్లడైంది. అందుకే ఒకే వయస్సు అనుభవం ఉన్న పైలట్లను డ్యూటీపై పంపాలని ఎయిరిండియా సంస్థకు డీజీసీఏ సూచించింది.