మీడియా దిగ్భ్రాంతి... కరోనా సోకి సీనియర్ టీవీ జర్నలిస్ట్ మృతి...
తమిళనాడులోని చెన్నైలో ఓ టీవీ జర్నలిస్ట్ కరోనా వైరస్ బారిన పడి మృతి చెందాడు. దాదాపు 14 రోజులు వైరస్తో పోరాడిన అతను... చివరకు ప్రాణాలు వదిలాడు. తమిళనాడులో కరోనా వైరస్తో మృతి చెందిన తొలి జర్నలిస్ట్ ఆయనే కావడం గమనార్హం. 20 ఏళ్లుగా అనేక మీడియా సంస్థలతో కలిసి పనిచేసిన జర్నలిస్టు కరోనాతో మృతి చెందడం చెన్నై మీడియా వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
Recommended Video
ఎవరా జర్నలిస్ట్...
చెన్నైకి చెందిన వేల్మురుగన్(41) ఓ ప్రముఖ మీడియా సంస్థలో సీనియర్ కెమెరామెన్గా పనిచేస్తున్నారు. జూన్ 14న మురుగన్కు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో చెన్నైలోని రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రి(RGGGH)లో చేరాడు. అయితే ఆరోగ్యం క్షీణించడంతో శనివారం(జూన్ 27)న ఆస్పత్రిలోనే తుది శ్వాస విడిచాడు.
ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం...
జర్నలిస్ట్ వేల్మురుగన్ మరణం చెన్నై మీడియా వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. చెన్నై ప్రెస్ క్లబ్ మురుగన్ మృతి పట్ల సంతాపం ప్రకటించింది. ముఖ్యమంత్రి పళనిస్వామి,డిప్యూటీ సీఎం పనీర్ సెల్వం,డీఎంకె అధ్యక్షుడు స్టాలిన్ సహా పలువురు రాజకీయ నాయకులు కూడా మురుగన్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. మురుగన్ కుటుంబానికి సీఎం పళనిస్వామి రూ.5లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. మురుగన్కు భార్య శన్ముగ సుందరి,కుమారుడు జీవ(11) ఉన్నారు.
మంత్రులూ తమవంతుగా...
మంత్రులు సి.విజయ భాస్కర్,డి.జయకుమార్,కాదంబర్ సి రాజు తమవంతుగా రూ.50వేలు చొప్పున మురుగన్ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. మురుగన్ మృతి చెందిన రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలోనే ఆయన భార్య శన్ముగ సుందరి కాంట్రాక్ట్ నర్సుగా పనిచేస్తుండటం గమనార్హం. ఆమె ఉద్యోగాన్ని పర్మినెంట్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. చెన్నై జర్నలిస్టులు,మురుగన్ మిత్రులు సోషల్ మీడియాలో ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి పనిచేసిన క్షణాలను గుర్తుచేసుకున్నారు.
ఇదీ తమిళనాడులో పరిస్థితి...
తమిళనాడులో ఇప్పటివరకూ 78,336 కరోనా కేసులు నమోదవగా... ఇందులో 51,699 కేసులు చెన్నైలోనే ఉండటం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 1075 మంది కరోనాతో మృతి చెందగా... ఇందులో ఒక్క చెన్నైలోనే 773 మంది మృతి చెందారు. శుక్రవారం డీఎంకె చెయ్యూర్ ఎమ్మెల్యే ఆర్టీ అరసుకు కరోనా పాజిటివ్గా తేలడంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనా బారినపడ్డ ఎమ్మెల్యేల సంఖ్య 5కి చేరింది.
ఓవైపు కరోనా కేసులు విజృంభిస్తున్న సమయంలోనే మరోవైపు జయరాజ్(62),ఆయన కుమారుడు బెనిక్స్(32)ల కస్టడీ డెత్కు వ్యతిరేకంగా చెన్నైలో తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.