సంక్షోభం వేళ..మోడీ సర్కార్కు బిగ్ షాక్: కోవిడ్ సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ చీఫ్ రాజీనామా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కల్లోలాన్ని రేపుతోంది. రోజురోజుకూ తీవ్రరూపాన్ని దాల్చుతోంది. రెండు మూడురోజులుగా రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుతోన్నప్పటికీ.. మరణాల్లో మాత్రం ఉధృతి కొనసాగుతోంది. నాలుగు వేలకు రోజువారీ మరణాలు నమోదవుతోన్నాయి. కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దాదాపు అన్ని రాష్ట్రాలు సంపూర్ణ లాక్డౌన్లోకి వెళ్లాయి. కోవిడ్ కట్టడి చర్యలను కఠినంగా అమలు చేస్తోన్నాయి.
ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కోవిడ్ పరిస్థితులపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇదివరకు ఏర్పాటు చేసిన సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ద ఇండియన్ సార్స్-సీఓవీ-2 జీనోమిక్ కన్సార్టియం ఛైర్మన్ షహీద్ జమీల్.. తన పదవికి రాజీనామా చేశారు. అర్ధాంతరంగా తప్పుకొన్నారు. ఈ అడ్వైజరీ గ్రూప్ గత ఏడాది డిసెంబర్లో ఏర్పాటైంది. కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ నేతృత్వం వహిస్తోన్న ఆరోగ్యశాఖ పర్యవేక్షణలో పని చేస్తోందీ గ్రూప్.
కరోనా వైరస్ విజృంభిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో కొత్తరకం కోవిడ్ స్ట్రెయిన్లు, వేరియంట్లపై అధ్యయనం, కరోనా మరింత వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన ముందుజాగ్రత్తలపై కేంద్రానికి సిఫారసులు చేయడం, ఇదే అంశంపై వివిధ దేశాలు ఏర్పాటు చేసిన అడ్వైజరీ గ్రూప్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు నిర్వహించడం వంటి కొన్ని కీలక బాధ్యతలు ఈ కమిటీ చేతుల్లో ఉన్నాయి. బ్రిటన్లో పుట్టుకొచ్చిన కరోనా కొత్తరకం వేరియంట్ బీ117 గురించి మొట్టమొదటి సారిగా కేంద్రప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది ఈ అడ్వైజరీ గ్రూపే.
ఈ అడ్వైజరీ గ్రూప్ చీఫ్ పదవి నుంచి షహీద్ జమీల్ అర్ధాంతరంగా తప్పుకోవడం కలకలం రేపుతోంది. తాను రాజీనామా చేయడానికి గల కారణాలను ఆయన వివరించలేదు. కరోనాను కట్టడి చేయడానికి తాము చేసిన సూచనలు, సిఫారసుల పట్ల కేంద్ర ప్రభుత్వం పెద్దగా స్పందించట్లేదని, కీలకమైన విషయాల్లో మొండిపట్టుదలకు పోతోందంటూ న్యూయార్క్ టైమ్స్లో ఆయన ఓ కాలమ్ రాశారు. కరోనా నివారణకు అవసరమైన విధానాలను రూపొందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.
దేశంలో కోవిడ్ మేనేజ్మెంట్, వ్యాక్సినేషన్ కార్యక్రమం మందకొడిగా సాగుతుండటం, వ్యాక్సిన్ కొరత, దేశీయ ఆరోగ్య వ్యవస్థ బలహీనంగా ఉందంటూ ఆయన ఆ కాలమ్లో రాసుకొచ్చారు. అడ్వైజరీ గ్రూప్ చీఫ్గా నియమితులు కావడానికి ముందు జమీల్.. వెల్కమ్ ట్రస్ట్ డీబీటీ ఇండియా అలయన్స్ సీఈఓగా పనిచేశారు. హెపటైటిస్-ఇ వైరస్పై పరిశోధనలు సాగించారు. హర్యానాలోని అశోకా విశ్వవిద్యాలయం బయోసైన్సెన్స్ విభాగం డైరెక్టర్గా ఉన్నారు.