బిచ్చగాళ్లు కాదు.. ఇక పనోళ్లు..! యాచకుల కోసం ఉత్తర ప్రదేశ్లో సంచలన పథకం..!!
లక్నో/హైదరాబాద్ : అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోంది. అందులో బాగంగానే బిచ్చగాళ్లకు కూడా ఓ పథకాన్ని తీసుకురాబోతోంది యోగీ ప్రభుత్వం. ఉత్తర ప్రదేశ్లోని లక్నో నగర పాలక సంస్థ బిచ్చగాళ్ళ కోసం ప్రత్యేక పథకాన్ని రూపొందించింది. శారీరకంగా సమర్థులైన బిచ్చగాళ్ళ చేత పని చేయించి, రోజువారీ వేతనం చెల్లించాలని నిర్ణయించింది. ఈ విధంగా పని చేసేందుకు ఇష్టపడనివారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా రంగం సిద్ధం చేస్తోంది. లక్నో మునిసిపల్ కమిషనర్ ఇంద్రమణి త్రిపాఠీ ఓ నెలపాటు అధ్యయనం నిర్వహించారు. లక్నోలో దాదాపు 4,500 మంది బిచ్చగాళ్ళు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 45 మందికి తొలి దశలో పనులు అప్పగించాలని నిర్ణయించారు.
Recommended Video
ఇంద్రమణి త్రిపాఠీ మాట్లాడుతూ బిచ్చగాళ్ళలో చాలా మంది పని చేయడానికి తగిన శారీరక సామర్థ్యం కలవారేనన్నారు. వారు సులువుగా సంపాదించుకుంటుండటంతో పని చేయడం లేదన్నారు. మొదటి దశలో 45 మందికి పనులు అప్పగిస్తామని, రెండో దశలో ఓ ప్రభుత్వేతర సంస్థ ద్వారా మరో 45 మందికి పని అప్పగిస్తామని చెప్పారు. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న లక్నోకు బిచ్చగాళ్ళవల్ల చెడ్డ పేరు వస్తోందన్నారు. అందుకే వారి చేత పనులు చేయించి, నగరాన్ని బిచ్చగాళ్ళ రహిత నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. పథకం చూడడానికి ఆదర్శంగా కనిపిస్తున్నా ఎంత వరకు అమలుకు సాద్యమనేదే ప్రశ్నార్ధకాంగా మారింది. పనిచేయడానికి ఎంత మంది యాచకులు సంసిద్దంగా ఉంటారో కూడా తేలాల్సి ఉంది. యాచకులు ప్రభుత్వానికి సహకరించి పనులు చేసుకుంటే అదే పథకం ఇతర రాష్ట్రాలకు చేరే అవకాశాలు కూడా లేకపోలేదు.