అమెరికా ఎన్నికలు, నల్లడబ్బుపై వేటు: సెన్సెక్స్ పతనం
ముంబై: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం, దేశంలో పెద్ద నోట్లపై వేటు ప్రభావాలు భారత స్టాక్ మార్కెట్లపై తీవ్రమైన ప్రభావం చూపాయి. సెన్సెక్స్ 1066 పాయింట్లు పతమైంది. అమెరికా అధ్యక్షునిగా డోనాల్డ్ ట్రంప్ గెలుస్తారనే అంచనాలు ప్రారంభమైన వెంటనే స్టాక్మార్కెట్లన్నీ కుప్పకూలాయి.
సెన్సెక్స్ 1600 పాయింట్ల దిగువన ప్రారంభమైంది. ప్రస్తుతం 900పాయింట్ల తక్కువలో ట్రేడవుతోంది. నిఫ్టీ 370 పాయింట్లు తగ్గింది. తూర్పు ఆసియా దేశాల మార్కెట్లన్నీ కూడా పడిపోయాయి. షాంఘై, జపాన్, హాంకాంగ్ మార్కెట్లు కూడా పతనమయ్యాయి.
అమెరికాలోని డోజోన్స్ మార్కెట్ సైతం పతనమైంది. బంగారం ధర మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే మార్కెట్లలోని డబ్బును బంగారం వైపు పెట్టుబడులుగా మళ్లించే అవకాశం కూడా ఉంది.
అమెరికా ఎన్నికల ఫలితం తూర్పు ఆసియా దేశాల్లోని స్టాక్మార్కెట్లన్నింటినీ ప్రభావితం చేసింది. ఆ ప్రభావం భారతీయ స్టాక్ మార్కెట్పై కూడా పడింది. మంగళవారం 1600 పాయింట్ల నష్టంలో మార్కెట్లు ప్రారంభమయ్యాయి.
బంగారానికి పెరిగిన డిమాండ్
మార్కెట్లోని డబ్బును బంగారంవైపు పెట్టుబడులుగా మళ్లించే అవకాశం ఉండటంతో బంగారానికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం 900 పాయింట్ల నష్టాల్లో స్టాక్మార్కెట్లు కొనసాగుతున్నాయి. అంటే దాదాపు రూ.2లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల వరకు మదుపరులు ప్రారంభంలోనే కోల్పోయారు. బ్యాంకింగ్, ఆటో షేర్లు పూర్తిగా పడిపోయాయి.
బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతిన్నది. నిన్నటి 500, 1000 నోట్ల రద్దు ప్రకటనతో పాటు, అమెరికా ఫలితాలు స్టాక్మార్కెట్లను షేక్ చేస్తున్నాయి. విదేశీ, స్వదేశీ పెట్టుబడుదారులు స్టాక్స్ అమ్ముకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.