కోలుకున్న స్టాక్ మార్కెట్లు.. ఎగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
ముంబై: అమెరికా స్టాక్ మార్కెట్ల దెబ్బకు గత వారం భారీగా పతనమైన దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం కోలుకున్నాయి. భారీ అమ్మకాల ఒత్తిడి నుంచి విముక్తి పొంది ఒక్కసారిగా పైకి ఎగిశాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా ఎగిసి 34,217.78 వద్ద ప్రారంభం కాగా నిఫ్టీ సైతం 69 పాయింట్లు లాభపడి 10,524 వద్ద ప్రారంభమైంది.
ప్రస్తుతం అమెరికా స్టాక్ మార్కెట్ల పరిస్థితి బాగుండడం దేశీయ ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం ఇచ్చినట్లయింది. మరోవైపు ఆసియా మార్కెట్లు కూడా జోరందుకున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 2 పైసల నష్టంతో రూ.64.28 వద్ద కొనసాగుతోంది.
సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 243 పాయింట్ల లాభంలో 34,248 వద్ద, నిఫ్టీ 73 పాయింట్ల లాభంలో 10,528 వద్ద ట్రేడవుతున్నాయి. నిఫ్టీ మిడ్క్యాప్ కూడా ట్రేడింగ్ ప్రారంభంలో ఒక శాతం మేర లాభపడింది.
నాల్కో, ఆయిల్ ఇండియా, బాటా ఇండియా, సన్ టీవీ నెట్వర్క్, అమర రాజ బ్యాటరీస్ 3 నుంచి 7 శాతం మేర ర్యాలీ కొనసాగిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, మణప్పురం ఫైనాన్స్, అశోక్ లేల్యాండ్, కాడిలా హెల్త్కేర్లు కూడా 2-5 శాతం లాభపడుతున్నాయి.
మొండిబకాయిల కారణంగా డిసెంబర్ క్వార్టర్లో భారీగా నష్టాలు మూటగట్టుకున్న ఎస్బీఐ తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతోంది. సోమవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే ఎస్బీఐ 4 శాతం మేర నష్టపోయింది.
మరోవైపు గత వారం గ్లోబల్ మార్కెట్ల పతనం దేశీయ స్టాక్ మార్కెట్లను బాగా దెబ్బతీసింది. గత ఏడు ట్రేడింగ్ సెషన్లలో విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్ నుంచి రూ.3,838 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. దీంతో గత వారమంతా దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో నడిచాయి.