ఉత్తరకొరియా ఎఫెక్ట్ ఇలా కూడా: కుదేలైన స్టాక్ మార్కెట్లు.. భారీ పతనం
నిఫ్టీ స్టాక్స్ లో కేవలం పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, విప్రోలు మాత్రమే లాభపడుతున్నాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 2శాతం మేర నష్టపోయాయి.
ముంబై: ఉత్తరకొరియా హెచ్చరికల పుణ్యమాని ఇప్పటికే అమెరికన్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలగా.. ఆ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై కూడా పడింది. సెన్సెక్స్ 300పాయింట్ల మేర భారీగా పతనమైంది. నిఫ్టీకి కూడా గట్టి దెబ్బ తగిలింది. 90పాయింట్లు నష్టపోయి 9750 మార్కు కిందకు పడిపోయింది.
సెన్సెక్స్ ప్రస్తుతం 274పాయింట్ల నష్టంలో 31,257వద్ద, నిఫ్టీ 93.55పాయింట్ల నష్టంలో 9,726వద్ద ట్రేడవుతున్నాయి. నిఫ్టీ స్టాక్స్ లో కేవలం పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, విప్రోలు మాత్రమే లాభపడుతున్నాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 2శాతం మేర నష్టపోయాయి.
మరోవైపు రూపాయి మారకపు విలువ కూడా భారీ స్థాయిలో పతనమవుతుండటం కలవరపెడుతోంది. నేటి ట్రేడింగ్ లో రూపాయి మారకం విలువ 34పైసలు పతనమై 64.18వద్ద ట్రేడ్ అవుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో మాత్రం బంగారం ధరలు విరామం లేకుండా భారీగా రూ.344 మేర పైకి ఎగిసి.. రూ. 29,188గా ఉన్నాయి.
ఇదిలా ఉంటే, నిఫ్టీ కంపెనీల్లో లిస్టయిన సిప్లా, స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా, సన్ ఫార్మా, బీపీసీఎల్, బాష్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హిందాల్కో ఇండస్ట్రీస్ శుక్రవారం ఫలితాలు ప్రకటించనున్నాయి. ఈ ఫలితాల ఆధారంగా ఆయా రంగాలు, కంపెనీల షేర్లలో కదలికలు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇటు భారత్-చైనా, అటు ఉత్తరకొరియా-అమెరికా మధ్య యుద్ద ప్రచారం జోరుగా జరుగుతుండటంతో.. ఈ ఎఫెక్ట్ మార్కెట్లను బలహీనపడేలా చేసింది. ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గుతుండటంతో స్టాక్ మార్కెట్లు ప్రతికూల ఫలితాలను చవిచూస్తున్నాయి.