మళ్లీ స్టాక్ మార్కెట్లు ఢమాల్, భారీగా పతనంమైన సెన్సెక్స్, నిఫ్టీ.. అమెరికా డౌజోన్స్ ప్రభావమే
ముంబై: అమెరికన్ స్టాక్ మార్కెట్లు మళ్లీ కుప్పకూలాయి. ఒకరోజు విరామం తరువాత మళ్లీ అమెరికా స్టాక్ మార్కెట్లలో భారీ అమ్మకాలకు తెరలేచింది. కానీ ద్రవ్యోల్బణ అంచనాలతో ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. దీంతో మార్కెట్లు ఏకంగా 4 శాతం పతనమయ్యాయి.
డౌజోన్స్ 1033 పాయింట్లు(4.15 శాతం) కుప్పకూలి 23,860 వద్ద ముగిసింది. ఈ బాటలో ఎస్అండ్పీ 101 పాయింట్లు(3.75 శాతం) పతనమై 2581కు చేరగా.. నాస్డాక్ 275 పాయింట్లు(4 శాతం) పడిపోయి 6,777 వద్ద స్థిరపడింది.
జనవరి 26న నమోదైన గరిష్టాలతో పోల్చి చూస్తే.. అమెరికా స్టాక్ మార్కెట్లు 10 శాతం మేర పతనమయ్యాయి. తొమ్మిది సంవత్సరాల బుల్ రన్కు బ్రేక్ పడిందని మార్కెట్ విశ్లేషకులు వ్యాఖ్యానించారు.
అటు ఆసియన్ మార్కెట్లలోనూ షాంఘై 5.22 శాతం, జపాన్ నిక్కీ3.22 శాతం మేర పతనమయ్యాయి. ఈ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపైనా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేశారు. వారి అంచనాలకు తగ్గట్లుగానే శుక్రవారం ఆరంభంలోనే సెన్సెక్స్ 500 పాయింట్లకుపైగా పతనమైంది.
వరుసగా ఏడు సెషన్లలో భారీ నష్టాలు చవిచూసిన మన స్టాక్ మార్కెట్లు గురువారం తిరిగి పుంజుకున్నాయి అనుకునేలోపే మళ్లీ ఒక్కరోజు వ్యవధిలోనే తిరోగమనంలో పడ్డాయి. శుక్రవారం ఉదయం మార్కెట్లు ప్రారంభానికి ముందే సెన్సెక్స్ 410.71 పాయింట్లు పడిపోయి 34,0002.45కు చేరింది. నిఫ్టీ కూడా 160.40 పాయింట్లు దిగజారి 10,416.50 వద్ద ట్రేడ్ అయింది.
ఉదయం 9.15 గంటల ప్రాంతంలో మార్కెట్లు ప్రారంభమైన మరికాసేపటికే 30-షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 526.26 పాయింట్లు తగ్గి 33,886 వద్ద ట్రేడ్ అవుతుండగా, 50-షేర్ల ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 177.50 పాయింట్లు కోల్పోయి 10,399.40 వద్ద ట్రేడింగ్ కొనసాగించింది.
యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచబోతోందనే అంచనాలు స్టాక్స్ మార్కెట్లలో అమ్మకాలకు కారణమవుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు రియల్టీ, బ్యాంకింగ్ , ఫార్మా రంగాలు భారీగా నష్టపోతున్నాయి.
సెయిల్, సీసీడీ, గోవా కార్బన్ స్వల్పంగా లాభపడుతుండగా.. వేదాంతా, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, గ్లెన్మార్క్, రిలయన్స్ క్యాప్, బాటా, ఇన్ఫ్రాటెల్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, ఐబీ హౌసింగ్, ఐటీసీ, యాక్సిస్, అల్ట్రాటెక్, అంబుజా, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్ తదితర షేర్లు నష్టపోతున్నాయి.