రికార్డులు బద్దలు: గరిష్ట స్థాయికి బీఎస్ఈ సెన్సెక్స్, ఇన్వెస్టర్లు ఖుష్!
గురువారం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్(బీఎస్ఈ) సెన్సెక్స్ తొలిసారిగా 32వేల మార్క్ ను దాటడం విశేషం
ముంబై: వరుస శుభపరిణామాలు స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చాయి. రిటైల్ ద్రవ్యోల్బణం కనిష్ఠ స్థాయిని తాకడం.. సానుకూల రుతుపవనాలు.. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. వరుసగా నాలుగు రోజుల నుంచి మార్కెట్లో ఈ జోరు కొనసాగుతోంది.
తాజాగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్(బీఎస్ఈ) సెన్సెక్స్ తొలిసారిగా 32వేల మార్క్ ను దాటడం విశేషం. గడిచిన సెషన్లో 58 పాయింట్ల లాభంతో 31,805 వద్ద సెన్సెక్స్ ముగియగా.. గురవారం ఆరంభమే 190పాయింట్స్ పైకి ఎగబాకింది. దీంతో ఇన్వెస్టర్లలో విశ్వసనీయత బలపడి పెట్టుబడులు గణనీయంగా పెరగడంతో.. బీఎస్ఈ 32వేల బెంచ్ మార్క్ను చేరుకుంది.
గురువారం నాడు ఇదే జోరుతో ట్రేడింగ్ తుది దశ ముగియడంతో.. బీఎస్ఈ 232పాయింట్ల లాభాన్ని గడించి 32,037 వద్ద గరిష్టస్థాయి వద్ద స్థిరపడింది. దీంతో బీఎస్ఈ ట్రేడింగ్ గత రికార్డులను బద్దలు కొట్టినట్లయింది. ఇక ఎన్ఎస్ఈ(నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్) నిఫ్టీ సైతం మరో మైలురాయికి చేరువడం విశేషం. 9900 మార్కుకు ఎనిమిది పాయింట్ల దూరంలో ఎన్ఎస్ఈ ట్రేడింగ్ ముగిసింది.
గురువారం నాటి ట్రేడింగ్లో 76పాయింట్ల లాభం గడించి, 9,892 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ(నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్)లో హిందాల్కో, ఐటీసీ లిమిటెడ్, భారతీ ఎయిర్టెల్, ఎస్ బ్యాంక్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు లాభపడ్డాయి. అదే సమయంలో ఓఎన్జీసీ, భారతీ ఇన్ఫ్రాటెల్, ఏషియన్ పెయింట్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఐషర్ మోటార్స్ షేర్లు నష్టపోయాయి.