ప్రత్యేక రాష్ట్రంగా ఉత్తర కర్ణాటక: ఆగస్టు 2 బంద్, మోసం చేశారు, బళ్లారి శ్రీరాములు, ఉమేష్ కత్తి!
బెంగళూరు: ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 2వ తేదీ ఆ ప్రాంతంలోని 13 జిల్లాల్లో బంద్ కు పిలుపునిచ్చారు. ఆగస్టు 2వ తేదీ 13 జిల్లాల్లో బంద్ విజయవంతం చెయ్యడానికి అందరూ సహకరించాలని బంద్ నిర్వహకులు పిలుపునిచ్చారు.
సీఎం పట్టించుకోలేదు
ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం పోరాట సమితి అధ్యక్షుడు సోమశేఖర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి బడ్జెట్ లో ఉత్తర కర్ణాటకకు నిధులు కేటాయించకుండా పూర్తిగా నిర్లక్షం చేశారని ఆరోపించారు.
ప్రత్యేక రాష్ట్రం కావాలి
ఉత్తర కర్ణాటకకు ఎలాంటి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించలేదని, నిధులు కేటాయించలేదని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయితే మా ప్రాంతంలోని 13 జిల్లాలను తామే అభివృద్ది చేసుకుంటామని సోమశేఖర్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించే వరకు తాము పోరాటం చేస్తామని సోమశేఖర్ ధీమా వ్యక్తం చేశారు.
అన్యాయం చేశారు
కర్ణాటకలో ఏ పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చినా ఉత్తర కర్ణాటకకు తీరని అన్యాయం చేస్తున్నారని సోమశేఖర్ ఆరోపించారు. అందుకే 13 జిల్లాలతో ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని సోమశేఖర్ డిమాండ్ చేశారు. బంద్ రోజు 13 జిల్లాల ప్రజలు సహకరించాలని సోమశేఖర్ మనవి చేశారు.
బళ్లారి శ్రీరాములు, ఉమేష్ కత్తి
గతంలో మాజీ మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు ఉమేష్ కత్తి, బళ్లారి శ్రీరాములు, ఎఎస్ పాటిల్ సైతం ప్రత్యేక ఉత్తర కర్ణాటక రాష్ట్రం ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 2వ తేదీ జరిగే బంద్ కు అనేక సంఘ, సంస్థలు మద్దతు ఇస్తున్నాయని సోమశేఖర్ మీడియాకు చెప్పారు.
రైతులు, విద్యార్థులు
ఆగస్టు 2వ తేదీ 13 జిల్లాల్లో జరిగే బంద్ కు ఉత్తర కర్ణాటక రైతు సంఘం, కన్నడ సంఘాలు, విద్యార్థి సంఘాలు, చలన చిత్ర వాణిజ్య మండలితో పాటు అనేక సంఘాలు మద్దతు ఇస్తున్నాయని, బంద్ ను ప్రజలు విజయవంతం చెయ్యాలని సోమశేఖర్ మనవి చేశారు.