ఒమర్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం కాంగ్రెస్ స్పందించాలని మోడీ డిమాండ్
జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రధాని, రాష్ట్రపతి ఉండాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఒమర్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ఆశ ఎన్నటికీ నెరవేరదని స్పష్టం చేసింది. మహాకూటమిలోభాగస్వామి అయిన నేషనల్ కాన్ఫరెన్స్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తన వైఖరి స్పష్టం చేయాలని ప్రధాని నరేంద్రమోడీ డిమాండ్ చేశారు.
మళ్లీ వేసేశాడు: ఓ రాహుల్... ఓ అచ్యుతానందన్..ఓ అమూల్ బేబీ..ఇదీ స్టోరీ
జమ్ముకాశ్మీర్కు ప్రత్యేక ప్రధాని
జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370, 35 ఏలను రద్దుచేస్తామని బీజేపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. బందీపొరాలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన ఆయన.. 2020 నాటికి ఆర్టికల్ 35ఏను రద్దు చేస్తామని బీజేపీ చేసిన ప్రకటనను తీవ్రంగా తప్పుబట్టారు. తాము షరతులతో భారత్లో విలీనమయ్యామని, తమ గుర్తింపు తమకు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. గతంలో జమ్మూకాశ్మీర్కు ప్రత్యేకంగా రాష్ట్రపతి, ప్రధాని ఉండేవారన్న విషయాన్ని గుర్తుచేసిన ఒమర్, ఆ పరిస్థితి తిరిగి తెచ్చుకుంటామని తేల్చిచెప్పారు.
ఒమర్ వ్యాఖ్యలపై అరుణ్ జైట్లీ ఫైర్
జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కామెంట్లపై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఫైర్ అయ్యారు. ఆ రాష్ట్రానికి ప్రత్యేకంగా రాష్ట్రపతి, ప్రధాని ఉండాలన్న ఆయన కల ఎన్నటికీ నెరవేరదని స్పష్టం చేశారు. వజీర్ - ఎ - ఆజం, సదర్ - ఎ - రియాసత్ పదవులను పునరుద్దరించాలన్న ఒమర్ డిమాండ్ వేర్పాటువాదుల మనోస్థితికి అద్దం పడుతోందని జైట్లీ విమర్శించారు. భారత్లో ఏ ప్రభుత్వం కూడా అలాంటి తప్పిదాలు చేయనివ్వదని ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ స్పందించాలని మోడీ డిమాండ్
నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఒమర్ అబ్దుల్లా కామెంట్లపై కాంగ్రెస్ స్పందించాలని ప్రధాని నరేంద్రమోడీ డిమాండ్ చేశారు. ఈ విషయంలో తన వైఖరి స్పష్టం చేయాలని అన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ డిమాండ్ను మహాకూటమిలోని ఇతర భాగస్వామ్య పార్టీలు కూడా అంగీకరిస్తాయా అనే విషయంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. భారతదేశాన్ని ఆరు దశాబ్దాల వెనుకకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్, 1953 నాటి పరిస్థితులు సృష్టించాలని చూస్తోందని మోడీ మండిపడ్డారు. ఈ విషయంలో దేశ ప్రజలకు స్పష్టతనివ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్పై ఉందని మోడీ స్పష్టం చేశారు.