ప్రత్యేక రాష్ట్రం అడిగితే షోకాజ్ నోటీసులు ఇచ్చిన కాంగ్రెస్
బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ తెలంగాణను విభజించినట్లే కర్ణాటకను రెండుగా విడదియ్యాలని అడిగినందుకు కాంగ్రెస్ పార్టీ శాసనస సభ్యుడికి ఆ పార్టీ పెద్దలు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఉత్తర కర్ణాకటలోని విజయపుర జిల్లా, దేవరహిప్పరగి శాసన సభ నియోజక వర్గం ఎంఎల్ఏ ఎ.ఎస్.పాటిలకు కాంగ్రెస్ నాయకులు గురువారం షోకాజ్ నోటీసులు పంపించారు.
ముఖ్యమంత్రి సిద్దరామయ్య సూచనల మేరకే కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్షం నేత అప్పాజీ నాడేగౌడ ఎ.ఎస్. పాటిలకు షోకాజ్ నోటీసులు పంపించారని తెలిసింది. ఒక్క వారంలో షోకాజ్ నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
గత కొంత కాలం నుండి ఉత్తర కర్ణాటకలో అభివృద్ది పనులు జరగడం లేదని, 13 జిల్లాలో తాగునీరు అందక ప్రజలు అల్లాడుతున్నారని ఎ.ఎస్. పాటిల ఆరోపించారు. బీ.ఎస్. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉత్తర కర్ణాటకకు విడుదల చేసిన నిధుల కంటే సిద్దరామయ్య నేతృత్వంలోని ఈ ప్రభుత్వం రెండు శాతం తక్కువగా విడుదల చేసిందని బహిరంగంగా ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణను విడదీసినట్లే కర్ణాటక నుండి ఉత్తర కర్ణాటక విడదియ్యాలని ఎ.ఎస్. పాటిల డిమాండ్ చేశారు. నీ ప్రవర్థన వలన పార్టీకి నష్టం జరుగుతున్నదని, బహిరంగంగా ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు సూచించారు.