జైలు నుంచి విడుదల: ఎవరీ మసారత్ ఆలం..? రాజకీయ ఖైదీనా లేక ఉగ్రవాదా..?
శ్రీనగర్: కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు మసరాత్ ఆలమ్ (44)ను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం శనివారం రాత్రి విడుదల చేసింది. ఆయనపై మరో 17 కేసులు పెండింగ్లో ఉన్నాయి. మసారత్కు వాస్తవాధీన రేఖకు రెండు వైపులా మంచి ప్రజాదరణ ఉంది. అలాంటి మసరాత్ ఆలంను ఎలా విడుదల చేస్తారంటూ కాంగ్రెస్ బీజేపీపై విమర్శలు చేసింది.
ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం సహా పలు కేసుల్లో ఆయన నిందితుడు. వేర్పాటు వాద ఉద్యమ నేతగా, ఉగ్రవవాదులకు సహాయం చేసాడన్న ఆరోపణలున్న వ్యక్తిని ఎలా విడుదల చేస్తారని కాంగ్రెస్ పార్టీ బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసింది. 2008-10 మధ్య కశ్మీర్ లోయలో జరిగిన వివిధ ఆందోళనల్లో రాళ్లు విసిరిన కేసుల్లో ఆయన జైలుపాలయ్యారు.
బారాముల్లా కారాగారం నుంచి విడుదలైన మసరాత్ ఆలంను స్ధానిక షహీద్ గంజ్ - పోలీసు ఠాణాకు తరలించారు. అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులకు ఆయన్ని అప్పగించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. హురియత్ కాన్ఫరెన్స్ అధినేత సయ్యద్ అలీ షా గిలానీకి అత్యంత సన్నిహుతుడిగా పేర్కొంటారు. హురియత్ కాన్ఫరెన్స్ అనుబంధ సంస్ధైన ముస్లింలీగ్ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు.
విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే కారణం చేత గతంలో పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించగా అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఎట్టకేలకు 2010లో శ్రీనగర్ సమీపంలో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ముఫ్తీ మహ్మద్ సయీద్ నేతృత్వంలోని పీడీపీ - బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నేర పూరిత అభియోగాల్లేకుండా జైలులో ఉన్న వారిని విడుదలచేయాలని నిర్ణయించింది.
జమ్మూ కాశ్మీర్లోని రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని సీఎం ముఫ్తీ మహ్మద్ సయీద్ ఆదేశాల మేరకు మసరాత్ ఆలంను విడుదల చేస్తున్నట్లు ఆ రాష్ట్ర డీజీపీ కే రాజేంద్ర శనివారం మీడియాకు చెప్పారు. కాగా, ఆలంను విడుదలను ఎట్టి పరిస్ధితుల్లోనూ సహించబోమని బీజేపీ స్పష్టం చేసింది.
ఆయన ఒక రాజకీయ ఖైదీ కాదని, ఒక ఉగ్రవాదని పేర్కొంది. ఆలం వల్ల జాతీయ భద్రతకు ముప్పు పొంచిఉందని పేర్కొంది. ఆలంను విడుదల చేస్తే ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకమేనని బీజేపీ హెచ్చరించింది.