శ్రీనగర్లో ఉద్రిక్తత: ఎగిరిన పాక్, ఐఎస్ జెండాలు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో ఆర్మీ జవాన్లపై రాళ్లు రువ్వడంతో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యేక కాలనీల విషయమై స్థానికులకు, భద్రతా బలగాలకు మధ్య వివాదం నెలకొంది. కాగా, కాశ్మీర్లో బుధవారమే రంజాన్ పండుగను జరుపుకొంటున్నారు.
ప్రార్థనల అనంతరం శ్రీనగర్లోని ఓ మసీదు వెలుపల వేర్పాటువాదులు ఆందోళనకు దిగారు. పలువురు యువకులు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ, పాకిస్థాన్ జెండాలు ప్రదర్శించారు.
ఆందోళనను అదుపు చేసేందుకు వెళ్లిన పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు మసీదు వద్ద ఆందోళనకారులను చెదరగొట్టడానికి బాష్పవాయుగోళాలు ప్రయోగించి, లాఠీ ఛార్జి చేశారు. అల్లర్లలో పలువురు గాయపడ్డారు.
కాశ్మీర్ లోయలోని పలు ప్రాంతాలతో పాటు అనంతనాగ్లోనూ అల్లర్లు చెలరేగాయి. దీంతో భద్రత సిబ్బంది మోహరించి ఆందోళనకారులు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాశ్మీర్లో ఈరోజే రంజాన్ జరుపుకుంటున్న సందర్భంగా ముందుజాగ్రత్తగా పోలీసులు పలువురు వేర్పాటువాద నేతలను గృహ నిర్బంధం చేశారు.