సెల్ టవర్స్పై దాడులు చేస్తున్న మిలిటెంట్స్
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారు. వారి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ప్రజలు సైనికులకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ ఫోన్ టవర్లు ధ్వంసం చేస్తున్నారు. శుక్రవారం మళ్లీ కమ్యూనికేషన్ సంస్థల మీద దాడులు చేశారు.
శుక్రవారం శ్రీనగర్ లోని వొడాఫోన్ టవర్ల మీద గ్రెనేడ్ లతో దాడులు చేశారు. టవర్లు పూర్తిగా ధ్వంసం చెయ్యడానికి ప్రయత్నించారు. అదే విధంగా ఎయిర్ సెల్ షో రూంను పూర్తిగా ధ్వసం చేశారు. టెలికాం సంస్థలను మిలిటెంట్లు టార్గెట్ చేసుకున్నారు.
టెలికాం సంస్థలపై దాడులు చేసి కమ్యూనికేషన్ వ్యవస్థను స్థంభింప చెయ్యాలని మిలిటెంట్లు దాడులకు పాల్పడుతున్నారు. గతంలో అనేక సార్లు టెలికాం సంస్థల మీద దాడులు జరిగాయి. లష్కర్ ఏ తోయిబా మిలిటెంట్లు దాడులకు పాల్పడుతున్నారు.
సుమారు 50 టవర్లు నేలమట్టం చేశారు. కాశ్మీర్ లోయలో ఉంటున్న ప్రజలు ప్రతి నిత్యం సైనికులకు సహకరిస్తు తమ కార్యకలాపాలు అడ్డుకుంటున్నారని మిలిటెంట్లు భావిస్తున్నారు. అందువలనే కమ్యూనికేషన్ సంస్థల మీద దాడులు చేస్తున్నారని అధికారులు అంటున్నారు.