'తండ్రీ కొడుకులు' మళ్ళీ ఒక్కటికానున్నారా,'అమర్' కు చెక్ , సైకిల్ ' అఖిలేష్ కేనా
సమాజ్ వాదీ పార్టీలో సంక్షోభం ముగింపు దశకు వచ్చేలా కన్పిస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో శివపాల్ యాదవ్, అమర్ సింగ్ ములాయం సింగ్ యాదవ్ సమావేశమయ్యారు.
లక్నో : సమాజ్ వాదీ పార్టీలో సంక్షోభం ముగింపు దశకు వచ్చేలా కన్పిస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ డిమాండ్ మేరకు మరో మూడు మాసాల పాటు పార్టీ కార్యక్రమాలకు పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ దూరంగా ఉండేందుకు సిద్దమయ్యారని ప్రచారం సాగుతోంది.అయితే ఈ విషయాన్ని పార్టీ అధికారికంగా ప్రకటించలేదు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమీషన్ ప్రకటించింది. ఈ షెడ్యూల్ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ఉండాల్సిన నాయకులంతా పార్టీ సంక్షోభంపై కేంద్రీకరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, తన తండ్రి ములాయం సింగ్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు బావుట ఎగురవేశాడు. పార్టీ జాతీయ అధ్యక్షపదవిని చేపట్టాడు.మరో వైపు పార్టీ ఎన్నికల గుర్తు తనకే ఇవ్వాలని ఎన్నికల కమీషన్ ను కూడ కోరాడు.
ములాయం సింగ్ కూడ ఎన్నికల కమీషన్ ను ఆశ్రయించి ఎన్నికల గుర్తు ను తనకే ఇవ్వాలని డిమాండ్ చేశాడు.అయితే ఇద్దరు నాయకులు కూడ తమకు మద్దతిచ్చే వారితో జనవరి 9వ, తేదిలోపుగా అఫిడవిట్లను సమర్పించాలని ఎన్నికల కమీషన్ కోరింది.
పార్టీకి మూడు మాసాలపాటు అమర్ దూరం
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పార్టీ కార్యకలాపాలకు మూడు మాసాల పాటు దూరంగా ఉండాలని ,ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన తండ్రి తో ములాయం సింగ్ కు తేల్చి చెప్పాడు. దరిమిలా అమర్ సింగ్ కూడ తన స్నేహితుడు ములాయం సింగ్ యాదవ్ కోసం ఈ మేరకు ఈ డిమాండ్ కు ఒప్పుకొన్నట్టు ప్రచారం సాగుతోంది. ఎన్నికల కమీషన్ ఇద్దరికి నోటీసులు పంపడంతో ఈ ఇద్దరు నాయకుల మద్య రాజీ ప్రయత్నాల్లో భాగంగా అమర్ సింగ్ పార్టీ వ్యవహరాలకు దూరంగా ఉండాలని అఖిలేష్ డిమాండ్ చేశారని సమాచారం.
అఖిలేష్ తో శివపాల్ యాదవ్ రాజీ చర్చలు
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో బాబాయి శివపాల్ యాదవ్ సమావేశమయ్యారు, పార్టీ సంక్షోభ నివారణలో భాగంగా పార్టీ నాయకులు విస్తృతంగా చర్చిస్తున్నారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి అఖిలేష్ తో శివపాల్ యాదవ్ సమావేశమయ్యారు.అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పార్టీ నాయకుల మద్య విస్తృత చర్చలు పార్టీలో నెలకొన్న సంక్షోభానికి ముగింపు పలికేందుకుగాను ప్రయత్నిస్తున్నట్టు సమాచారం వస్తోంది. ఈ మేరకు ములాయం సింగ్, అఖిలేష్, శివపాల్ యాదవ్ లు వరుసగా భేటీలు అవుతున్నారు.
ములాయంతో అమర్ సింగ్ సమావేశం
ఉత్తర్ ప్రదేశ్ లో అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ సంక్షోభ నివారణలో భాగంగా రెండు గ్రూపుల నాయకులు సమావేశాలు కొనసాగిస్తున్నారు. ములాయం సింగ్ ఇంటికి అమర్ సింగ్ చేరుకొన్నారు. ములాయంతో ఆయన సుదీర్ఘంగా సమావేశమయ్యారు. శివపాల్ యాదవ్ అఖిలేష్ తో చర్చించి ఆ చర్చల సారాంశాన్ని తన సోదరుడు ములాయం సింగ్ కు వివరించాడు. రెండు వర్గాలు రాజీకి వచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.శుక్రవారం సాయంత్రానికి రెండు వర్గాల మద్య రాజీ కుదిరే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు.
మద్దతుదార్ల అఫిడవిట్లను ఎన్నికల కమీషన్ కు ఇవ్వనున్న అఖిలేష్
ఎన్నికల కమీషన్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ నెల 9వ, తేదిలోపుగా తమ మద్దతుదారులతో కూడిన అఫిడవిట్లను ఎన్నికల కమీషన్ ను ఇవ్వాల్సిన పరిస్థితి అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ లకు ఉంది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో శుక్రవారంనాడు కొన్నిఅఫిడవిట్లను ఎన్నికల కమీషన్ ను సమర్పించనున్నారు అఖిలేష్ వర్గం .గురువారం నాడు సుమారు రెండువందల మందికి పైగా పార్టీకి చెందిన ఎంఏల్ఏలు, ఎంఏల్ సి లతో అఫిడవిట్లను తీసుకొన్నారు. ఈ అఫిడవిట్లను శుక్రవారం నాడు ఇవ్వనున్నారు.శనివారం నాడు మరో ఐదువేల మంది తన మద్దతుదారుల అఫిడవిట్లను అఖిలేష్ వర్గం ఎన్నికల కమీషన్ కు శనివారం నాడు అందించనుంది.