సగానికి తగ్గనున్న కోవిషీల్డ్ ఉత్పత్తి -సీరం కీలక నిర్ణయం- ఆర్డర్లపై కేంద్రం మౌనంతో
భారత్ లో ఒమిక్రాన్ ముప్పు పెరుగుతున్న వేళ వ్యాక్సిన్లకు డిమాండ్ కూడా పెరుగుతోంది. అయితే ఇప్పటికే ఉత్పత్తి అయిన వ్యాక్సిన్లు రాష్ట్రాలకు చేరినా వాటిని పూర్తిస్ధాయిలో వినియోగించలేదు. దీంతో కేంద్రం కొత్తగా వ్యాక్సిన్ల కొనుగోలు విషయంలో మౌనం వహిస్తోంది. ఈ నేపథ్యంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి సగానికి తగ్గబోతోంది.
కేంద్రం నుంచి కొత్తగా ఆర్డర్లు లేకపోవడంతో కోవిషీల్డ్ ఉత్పత్తిని సగానికి తగ్గించాలని సీరం ఇన్ స్టిట్యూట్ నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీరం సీఈవో ఆదార్ పూనావాలా వెల్లడించారు. వచ్చే వారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. దేశానికి భారీ మొత్తంలో స్టాక్ అవసరమైతే అదనపు సామర్థ్యాన్ని కొనసాగించాలనుకుంటున్నట్లు సీరం భావిస్తోంది. అయితే భవిష్యత్తులో కేంద్రం కోరినా వ్యాక్సిన్ కొరత లేకుండా చూస్తామని పూనావాలా చెప్తున్నారు.
తాజాగా రష్యా అధినేత పుతిన్, విదేశాంగ, రక్షణమంత్రులతో జరిపిన చర్చల్లో భారత్.. ఆ దేశానికి చెందిన స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ తీసుకునేందుకు అంగీకరించింది. భారత్ లోనే ఈ వ్యాక్సిన్లు తయారు చేసి మరీ మన దేశానికి రష్యా అందించబోతోంది. దీంతో కోవిషీల్డ్, కోవాగ్జిన్ స్ధానంలో స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ వచ్చి చేరే అవకాశముంది. దీంతో కేంద్రం కొత్తగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఆర్డర్లు ఇవ్వడం లేదని తెలుస్తోంది. అయితే ఓమిక్రాన్ ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్డర్లపై కేంద్రం మౌనంగా ఉండటంతో సీరం ఇన్ స్టిట్యూట్ తయారు చేసే వ్యాక్సిన్లు కూడా వృథా అవుతున్నాయి. దీంతో ఉత్పత్తిని సగం తగ్గించేందుకు సీరం సిద్ధమవుతోంది.
Recommended Video
కొత్త కోవిడ్ వేరియంట్, ఓమిక్రాన్ ఆవిర్భావం నేపథ్యంలో ప్రస్తుత వ్యాక్సిన్ల సమర్థతపై చర్చ జరుగుతోంది అయితే సీరం మాత్రం తమ వ్యాక్సిన్ కోవిషీల్డ్ ఓమిక్రాన్ పైన కూడా సమర్ధవంతంగా పనిచేస్తుందని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్లు పని చేయవని నమ్మడానికి ఎటువంటి కారణం లేదని పూనావాలా తెలిపారు. రెండుసార్లు టీకాలు వేయడంతో సరైన స్థాయి రక్షణ ఉండదని నమ్మడానికి ఎటువంటి కారణం లేదని ఆయన వెల్లడించారు. భారతీయ నిపుణులు తమ వ్యాక్సిన్ తో రక్షణ స్థాయి చాలా బాగుందని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.