ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్: సీరం సంచలన నిర్ణయం-భారత్లో క్లినికల్ ట్రయల్స్ నిలిపివేత -డీసీజీఐ నోటీసులతో
ప్రయోగదశల్లో ఉన్న కొవిడ్-19 వ్యాక్సిన్లలో మిగతా వాటికంటే మంచి ఫలితాలు సాధించి, ఫ్రంట్ రన్నర్ గా నిలిచిన ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనికా కొవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ భారత్ లోనూ నిలిచిపోయాయి. . 'ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా' 'కొవిషీల్డ్' క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించి సీరం ఇనిస్టిట్యూట్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ లోనూ క్లినికల్ ట్రయల్స్ ను తాత్కాలకంగా నిలిపేస్తున్నట్లు గురువారం ప్రకటించింది.
ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్: సీరం సంస్థకు షాక్ - భారత్ లో ట్రయల్స్ కొనసాగింపుపై డీసీజీఐ నోటీసులు
స్విడిష్-బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా.. ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి 'కొవిషీల్డ్' పేరుతో రూపొందించిన వ్యాక్సిన్ డోసు వల్ల యూకేలో ఓ వాలంటీర్ ఆరోగ్యం వికటించిన దరిమిలా అక్కడ క్లినికల్ ట్రయల్స్ ను నిలిపేశారు. యూకే సహా ఇంకొన్ని దేశాల్లోనూ అదే పని చేశారు. కానీ ఇండియాలో భాగస్వామిగా ఉన్న సీరం సంస్థ మాత్రం ప్రయోగాలను కొనసాగిస్తామని చెప్పగా.. అందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ''డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)''అభ్యంతరం తెలిపింది.
'కొవిషీల్డ్' వ్యాక్సిన్ డోసు వల్ల యూకేలో ఒక వాలంటీర్ కు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని, అందుకే ట్రయల్స్ నిలిపేసినట్లు ఆక్సాజెనికా సంస్థ ప్రకటన చేసిందని, ఈ నేపథ్యంలో భారత్ లో భాగస్వామిగా ఉన్న సీరం సంస్థ వ్యాక్సిన్ సేఫ్టీపై కనీసమాత్రంగానైనా వివరణ ఇవ్వలేదని మండిపడుతూ డీసీజీఐ బుధవారం రాత్రి నోటీసులు జారీ చేసింది. సీరం తీరు బాధ్యతారాహిత్యంగా ఉందన్న డీసీజీఐ.. క్లినికల్ ట్రయల్స్ అనుమతుల్ని ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో విధిలేని పరిస్థితుల్లో సీరం తన ప్రయోగాలను నిలిపేస్తున్నట్లు గురువారం తెలిపింది.
ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్పై సీరం క్లారిటీ - భారత్లో ట్రయల్స్ ఆగవు - అసలు కారణం ఇదే
నిజానికి యూకేలో వాలంటీర్ కు సైడ్ ఎఫెక్ట్ వచ్చింది వ్యాక్సిన్ డోసు వల్ల కాదని, ఇండియాలో 17 చోట్ల జరుపుతోన్న క్లినికల్ ట్రయల్స్ లో ఎలాంటి సమస్య ఉత్పన్నం కాలేదని, కాబట్టి ట్రయల్స్ కొనసాగిస్తామని సీరం సంస్థ సీఈవో అధర్ పునావాలా బుధవారం మీడియాకు వివరణ ఇచ్చారు. ఆయనా వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటలకే డీసీజీఐ షోకాజ్ నోటీసులు పంపడం గమనార్హం. జీసీజీఐకి ఎలాంటి వివరణ ఇస్తారు? మళ్లీ క్లినికల్ ట్రయల్స్ ఎప్పుడు పున:ప్రారంభిస్తారు? అనే విషయాలపై క్లారిటీ రావాల్సిఉంది.