'కోవీషీల్డ్' వివాదం... వాలంటీర్ భయానక అనుభవం..? రూ.100కోట్లు పరువు నష్టం దావా వేసిన సీరమ్...
కరోనా నివారణ కోసం అభివృద్ది చేస్తున్న వ్యాక్సిన్లలో చాలావరకూ ప్రస్తుతం చివరి దశ ప్రయోగాల్లో ఉన్నాయి. భారత్లోనూ కోవ్యాగ్జిన్,కోవీషీల్డ్,స్పుత్నిక్ వి తదితర వ్యాక్సిన్లు మూడో దశ ప్రయోగాల్లో ఉన్నాయి. అయితే ఇందులో కోవీషీల్డ్ ప్రయోగాలకు సంబంధించి ఓ వివాదం తెర పైకి వచ్చింది. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ది చేసిన ఈ వ్యాక్సిన్పై భారత్లోని సీరమ్ ఇన్స్టిట్యూట్ మూడో దశ ప్రయోగాలు జరుపుతోంది. అయితే ప్రయోగ దశలో ఈ వ్యాక్సిన్ తన ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపించిందని ఓ వాలంటీర్ ఆరోపిస్తున్నాడు. క్లినికల్ ట్రయల్స్ నిలిపివేసి వ్యాక్సిన్ లోపంపై విచారణ జరపాలని కోరుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నాడు. తన ఆరోగ్యానికి హాని చేసినందుకు రూ.5కోట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాడు. అయితే సీరమ్ ఇన్స్టిట్యూట్ సదరు వాలంటీర్పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేయడం గమనార్హం.
అక్టోబర్ 1న వ్యాక్సినేషన్....
చెన్నైకి చెందిన ఓ వాలంటీర్ కోవీషీల్డ్ క్లినికల్ ట్రయల్స్లో పాల్గొంటున్నాడు. ఇందులో భాగంగా సీరమ్ ఇన్స్టిట్యూట్ నిపుణులు అక్టోబర్ 1న అతనికి కోవీషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చారు. అయితే వ్యాక్సినేషన్ తర్వాత తన ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడిందని వాలంటీర్ ఆరోపిస్తున్నాడు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తలనొప్పితో పాటు.. ఆ తర్వాత 10 రోజుల్లో అసలేం జరిగిందో తనకు గుర్తుకురావట్లేదని చెప్పాడు. 'నా ఆరోగ్య పరిస్థితిపై ఇతరులు చెప్తున్న విషయాల ఆధారంగానే నేను మాట్లాడుతున్నాను తప్ప... నాకేమీ గుర్తురావట్లేదు. ఒకరోజంతా పూర్తిగా మతిమరుపు ఆవరించింది. కనీసం ఎవరినీ గుర్తుపట్టలేకపోతున్నాను.' అని చెప్పుకొచ్చాడు.
ఆ 10 రోజులు నాకేమీ గుర్తులేదు : వాలంటీర్
'వ్యాక్సిన్ ఇచ్చిన రోజు వైద్యుడు తమ ఇంటికి రావడం,ఆ తర్వాత నన్ను అంబులెన్సులో ఆస్పత్రికి తరలించడం అంతవరకే గుర్తుంది. ఆ తర్వాత 10 రోజులు ఏం జరిగిందో నాకేమీ గుర్తులేదు. ఆ 10 రోజులు ఐసీయూలో విపరీతమైన నొప్పితో బాధపడ్డాను. ఆ తర్వాత నా గదికి నన్ను షిఫ్ట్ చేశారు. ఇప్పుడు నా ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడింది. మళ్లీ 100శాతం ఆరోగ్యవంతుడిగా మారబోతున్నాను. అయితే నేనేదైతే బాధ అనుభవించానో అది దారుణం. క్లినికల్ ట్రయల్స్ అనేవి సైంటిఫిక్ ప్రక్రియలో భాగం. అయితే ఆ రిస్క్ తీసుకున్నందుకు అంత నొప్పిని,బాధను అనుభవించాలని దానర్థం కాదు కదా...' అని పేర్కొన్నాడు.
రూ.5కోట్లు పరిహారం చెల్లించాలని...
ఆరోగ్యంపై దుష్ప్రభావంతో తన భార్య,కుటుంబ సభ్యులు వ్యాక్సిన్ ట్రయల్స్ను నిలిపివేయాలని సీరమ్ ఇన్స్టిట్యూట్ అధికారులను కోరినట్లు ప్రముఖ జాతీయా మీడియాకు వెల్లడించాడు. ఎందుకిలా జరిగిందో విచారించాలని తమ కుటుంబ సభ్యులు సీరమ్ ఇన్స్టిట్యూట్ అధికారులను కోరితే వాళ్లు పట్టించుకోవట్లేదన్నాడు. తన ఆరోగ్యానికి హాని చేసినందుకు రూ.5కోట్లు నష్ట పరిహారం చెల్లించాలని ఆ వాలంటీర్ సీరమ్ ఇన్స్టిట్యూట్పై కోర్టులో దావా వేశాడు. మరోవైపు సీరమ్ ఇన్స్టిట్యూట్ అధికారులు మాత్రం ఆ వాలంటీర్ ఆరోపణలను ఖండించారు. వ్యాక్సిన్ పనితీరు సేఫ్గా ఉందని... ఇమ్యూనోజెనిక్(రోగ నిరోధక శక్తి)గా పనిచేస్తోందని అన్నారు. అయితే పూర్తి స్థాయి ఫలితాల తర్వాతే దీన్ని ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. చెన్నై వాలంటీర్ ఘటన చాలా దురదృష్టకరమని... అయితే దానికి టీకా కారణం కాదని పేర్కొన్నారు. అయినప్పటికీ అతని ఆరోగ్య పరిస్థితి పట్ల సానుభూతితోనే ఉన్నట్లు చెప్పారు.
Recommended Video
రూ.100కోట్లు పరువు నష్టం దావా..
సదరు చెన్నై వాలంటీర్పై సీరమ్ ఇన్స్టిట్యూట్ రూ.100 కోట్లు పరువు నష్టం దావా వేసింది. సంస్థ పేరును అన్యాయంగా అప్రతిష్టపాలు చేస్తున్నందుకు అతనికి లీగల్ నోటీసులు పంపించినట్లు సీరమ్ ఇన్స్టిట్యూట్ అధికారులు తెలిపారు. ఇది వ్యాక్సిన్కు సంబంధం లేని వివాదమని ఎథిక్స్ కమిటీ పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు సమర్పించినట్లు అధికారులు చెప్పారు. క్లినికల్ ట్రయల్స్కు సహకరిస్తే వ్యాక్సిన్ బయటకొస్తుందన్న ఉద్దేశంతో వాలంటీర్గా ముందుకెళ్తే... తన పట్ల బెదిరింపు ధోరణితో వ్యవహరించడం సరికాదని సదరు చెన్నై వాలంటీర్ పేర్కొన్నాడు.