‘సీరం’లో అగ్ని ప్రమాదం: 1000 కోట్లకుపైగానే ఆర్థిక నష్టం, అదర్ పూనావాలా విచారం
ముంబై: కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన ప్రముఖ టీకా ఉత్పత్తి సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ)లో గురువారం జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన నష్టం అంచనాలు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్ర పుణెలోని మంజరి ప్రాంణంలోని కొత్త ప్లాంటులో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృతి చెందగా, భారీ ఆస్తి నష్టం జరిగింది.
అగ్నిప్రమాదంతో సీరంకు రూ. 1000 కోట్ల ఆస్తి నష్టం
అగ్ని ప్రమాదం కారణంగా సీరం సంస్థకు ఆర్థికంగా రూ. 1000 కోట్ల కంటే ఎక్కువే నష్టం జరిగిందని ఆ సంస్థ సీఈవో అదర్ పూనావాలా శుక్రవారం వెల్లడించారు. ఈ ప్రమాదం కరోనా వ్యాక్సిన్ల తయారీపై ఎలాంటి ప్రభావం చూపకపోయినప్పటికీ.. కొత్తగా ఉత్పత్తి చేయబోయే మార్గాలను మాత్రం దెబ్బతీసిందన్నారు.
రోటా వ్యాక్సిన్, బీసీజీ తయారీని దెబ్బతీసిన ప్రమాదం
వ్యాక్సిన్లు తయారీ జరిగిన చోట మంటలు లేవని, టీకాల తయారీకి అక్కడ ఉంచిన పరికరాలు, ఇతర ఉత్పత్తులు దెబ్బతిన్నాయని పూనావాలా తెలిపారు. రోటా, బీసీజీ టీకాలకు సంబంధించి భారీ నష్టం జరిగిందని చెప్పారు. కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ను సీరం సంస్థనే ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికా సంస్థలతో కలిసి కోవిషీల్డ్ను సీరం సంస్థ ఉత్పత్తి చేస్తోంది.
కరోనా వ్యాక్సిన్ తయారీకి ఏ ఇబ్బందీ లేదు..
కాగా, అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే శుక్రవారం సందర్శించారు. కోవిషీల్డ్ టీకాకు ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. కరోనా టీకా యావత్ ప్రపంచానికి ఒక ఆశా కిరణమని, సీరం అగ్ని ప్రమాదం ఘటన గురించి వినగానే అంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైనట్లు చెప్పారు. ఈ అగ్ని ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. ప్రమాదానిిక గల కారణాలనేది దర్యాప్తు అనంతరం తెలుస్తుందని సీఎం ఉద్ధవ్ థాక్రే తెలిపారు. కాగా, మృతుల కుటుంబాలకు ఒక్కొరికి రూ. 25 లక్షల నష్ట పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. సీరం అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుగురు మరణించడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు.