సినిమా డైలాగులా: ఏపీపై వైకో, పోలీస్లపై కేసు పెట్టారా: హైకోర్టు
చెన్నై/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన ఎండీఎంకే అధినేత వైకో శుక్రవారం నాడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు వ్యాఖ్యలు మానవత్వానికి దూరంగా ఉన్నాయని మండిపడ్డారు. మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి పైన కూడా ఆయన ఘాటుగానే స్పందించారు.
అంతం కాదిది ఆరంభమని బొజ్జల సినిమా డైలాగులు కొడుతున్నాడన్నారు. శేషాచలం ఎన్కౌంటర్ ఘటనలో మృతి చెందిన కూలీలకు ఏపీ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ జైలులో ఉన్న కూలీలను వెనక్కి తెచ్చే బాధ్యత తమిళ సర్కారుదే అన్నారు.
ఎన్కౌంటర్కు నిరసనగా వైకో ఆధ్వర్యంలో వెల్లూరులో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్కౌంటర్ విషయమై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇది ఖండించదగ్గ, సెన్సిటివ్ వ్యవహారమన్నారు.
ఏపీ ప్రభుత్వం తీరు తమిళనాడు ప్రజల హృదయాల్ని గాయపరిచాయన్నారు. ఎన్కౌంటర్ ఘటనకు కారకులైన వారి పైన చర్యలు తీసుకోవాలని, వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, కాసేపట్లో వేలూరు నుండి వైకో భారీ ర్యాలీతో బయలుదేరనున్నారు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పోలీసులపై కేసు నమోదు చేశారా?: కోర్టు
శేషాచలం ఎన్ కౌంటర్ పైన హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ ఘటన పైన పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. దానిపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. స్పష్టమైన నివేదిక ఇవ్వాలని పేర్కొంది. ఈ ఘటనకు కారకులైన పోలీసుల పైన కేసు నమోదు చేశారా అని ప్రశ్నించింది. అనంతరం కేసును మధ్యాహ్నానికి వాయిదా వేసింది.