రాజకీయ ప్రక్షాళ దిశగా.. ‘సుప్రీం’ కీలక నిర్ణయం
2014లో క్రిమినల్ కేసులు ఎదుర్కొన్న దేశంలోని 1500 కంటే ఎక్కువమంది నాయకులపై చర్యలు తీసుకునేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు వచ్చేనెలలో ఓ ప్రణాళికతో రావాలని సుప్రీంకోర్టు కేంద్రానికి తెలిపింది.
న్యూఢిల్లీ: 2014లో క్రిమినల్ కేసులు ఎదుర్కొన్న దేశంలోని 1500 కంటే ఎక్కువ మంది రాజకీయ నాయకులపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటుకు వచ్చే నెలలో ఓ ప్రణాళికతో హాజరుకావాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్రానికి తెలిపింది.
అంతేకాదు, సత్వర విచారణ నిమిత్తం ఏర్పాటుచేసే కోర్టులకు ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలియజేయాలని కోరింది. 2014లో కేసులు నమోదైన 1581 మందిలో ఎందరు దోషులుగా తేలారు, ఎవరు బయటపడ్డారు... అలాగే కొత్తగా వారిపై ఎలాంటి కేసులు నమోదయ్యాయని ప్రశ్నించింది.
ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు పూర్తి నివేదికను తమకు అందజేయాలని సుప్రీంకోర్టు సూచించింది. నేరం రుజువైతే నేతలపై జీవితకాల నిషేధం విధించాలన్న విషయంలో కేంద్రం వైఖరి తెలియజేయాలని కూడా వ్యాఖ్యనించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేయడం వల్ల నేరం త్వరగా రుజువుతుందని పేర్కొంది.
మరోవైపు రాజకీయ నేతలు నేరానికి పాల్పడినట్టు రుజువైతే... ఎన్నికల్లో పోటీ చేయకుండా వారిపై జీవితకాల నిషేధం విధించాలంటూ ఎలక్షన్ కమిషన్ బుధవారం సుప్రీంకోర్టుకు నివేదించింది.
ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది అశ్వని ఉపాధ్యాయ ఓ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఆ తర్వాత విచారణ సమయంలో తమ వాదనలు వినిపించేందుకు మరికొందరు చేరారు. అయితే ఈసీ నుంచి మాత్రం సరైన స్పందన రాలేదు.
దీంతో, జులై 12న విచారణ సందర్భంగా ఈసీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నేరం రుజువైన నేతలను జీవితకాలం నిషేధించే విషయంలో స్పష్టమైన వైఖరిని తెలియజేయడం లేదంటూ మండిపడింది.
సుప్రీం వ్యాఖ్యలతో మేలుకున్న ఎన్నికల కమిషన్ ఈ విషయంలో తన వైఖరి ఏమిటో తెలియజేసింది. నేరం రుజువైన నేతలను జీవితకాలం పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని ఈసీ చెప్పింది.