మేం జోక్యం చేసుకోం: కేజ్రీవాల్కు సుప్రీం కోర్టులో షాక్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన క్రిమినల్ పరువు నష్టం కేసును కొట్టి వేయాలని కోరిన సీఎం కేజ్రీవాల్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తన పైన వేసిన క్రిమినల్ పరువు నష్టం కేసు విచారణ పైన స్టే విధించాలన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ను సుప్రీం కోర్టు మంగళవారం నాడు తిరస్కరించింది.
ఢిల్లీ హైకోర్టు, ట్రయల్ కోర్టు తీర్పుల్లో కలుగజేసుకోమని జస్టిస్ పీసీ ఘోష్, యూయూ లలిత్లతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇది కేజ్రీవాల్కు షాకింగ్. కేసు విచారణ కొనసాగుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.
డీడీసీఏలో అవినీతికి పాల్పడ్డారంటూ జైట్లీ పైన కేజ్రీవాల్ గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. జైట్లీ డిస్ట్రిక్ట్ అండ్ ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్కి పదమూడేళ్ల పాటు నాయకత్వం వహించారు. కేజ్రీవాల్ ఆరోపణలతో తన పరువుకు భంగం వాటిల్లిందంటూ జైట్లీ న్యాయస్థానంలో కేజ్రీవాల్పై సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావాలు వేశారు. రూ 10కోట్ల నష్టపరిహారం కోరారు. తనపై పెట్టిన క్రిమినల్ పరువు నష్టం కేసును కొట్టివేయమని కేజ్రీవాల్ న్యాయస్థానాన్ని కోరగా, కోర్టు అందుకు అంగీకరించలేదు.
డిసెంబర్ 21న ఢిల్లీ హైకోర్టులో జైట్లీ పరువు నష్టం దావా వేశారు. ఇది విచారణలో ఉండగానే దిగువ కోర్టులో కేజ్రీవాల్ సహా ఐదుగురు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై పరువు నష్టం దావా వేశారు. ఏప్రిల్ 7న కేజ్రీవాల్, ఇతర నేతలు కోర్టుకు హాజరయ్యారు. ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అనంతరం అక్టోబర్ 19న ట్రయల్ కోర్టులో కొనసాగుతున్న విచారణ పైన స్టే విధించాలని కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయగా, తిరస్కరించారు. హైకోర్టుతో పాటు దిగువ కోర్టులో ఒకేసారి పరువు నష్టం కేసులను విచారించడం చట్ట వ్యతిరేకం ఏదీ కాదని హైకోర్టు చెప్పింది. దీనిపై సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ వెళ్లగా.. హైకోర్టు, ట్రయల్ కోర్టు తీర్పులను పరిశీలించామని, కలుగ చేసుకోమని సుప్రీం తేల్చి చెప్పింది.