ఈడీకి షాక్: చిదంబరంకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి చిదంబరంకు సుప్రీంకోర్టులో కాస్త ఊరట లభించింది. చిదంబరం దరఖాస్తు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణ చేసింది. సీబీఐ కస్టడీ ముగిసే వరకు చిదంబరంను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోరాదని న్యాయస్థానం పేర్కొంది. అంతేకాదు ఈడీ కేసులో సోమవారం వరకు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇప్పటికే సీబీఐ కస్టడీలో ఉన్నందున చిదంబరం బెయిల్ పై బయటకు వచ్చే సదుపాయంను కోల్పోయారు. అయితే చిదంబరం ఇప్పటి వరకు బెయిల్పైనే ఉన్నారని విచారణ సంస్థలకు కూడా సహకరించారని గుర్తు చేసింది న్యాయస్థానం.
ఈడీ కేసులో బెయిల్ రద్దు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు చిదంబరం. అయితే అప్పటికప్పుడు కేసును విచారణ చేయలేమని న్యాయస్థానం తీర్పు చెప్పడంతో చిదంబరంను అరెస్టు చేసేందుకు ఈడీ రంగం సిద్ధం చేసింది. శుక్రవారం ఉదయం చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు విచారణ చేసింది. ఈడీ వర్షన్ను కాప్ కట్ చేసి ఢిల్లీ హైకోర్టు బెయిల్ను తిరస్కరించిందని చిదంబరం తరపున వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇలాగైతే కోర్టులపై నమ్మకం ఎలా ఏర్పడుతుందని ప్రశ్నించారు. ఏడు నెలలుగా తీర్పును రిజర్వ్లో ఉంచిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి.... ఒక్కరోజులో బెయిల్ తిరస్కరిస్తున్నట్లు చెప్పడం ఏమిటని కపిల్ సిబల్ ప్రశ్నించారు. కట్ కాపీ పేస్ట్ పద్దతిని అవలంబిస్తే ఇక రిలీఫ్ ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే కేసులో చాలా విషయాలు దాగి ఉన్నాయని ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సాల్సిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ఈకేసులో ఉన్న చాలా కంపెనీలు విదేశాల్లో ఉన్నట్లు చెప్పిన తుషార్ మెహతా... ఇందులో మనీలాండరింగ్ భారీ స్థాయిలో జరిగిందని వాదనలు వినిపించారు. ఇక భారీగా మోసం జరిగిందని చెప్పేందుకు తన వద్ద కొన్ని ఆధారాలున్నాయని కోర్టుకు తెలిపారు తుషార్ మెహతా. డిజిటల్ డాక్యుమెంట్స్, ఈమెయిల్ సంభాషణలు ఉన్నాయని చెప్పారు. అవినీతి డబ్బులు మనీలాండరింగ్ ద్వారా తరలించారని చెప్పారు. విదేశాల్లో 10 చోట్ల ఆస్తులు 17 బ్యాంకు అకౌంట్లు ఉన్నట్లు గుర్తించినట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
అయితే చివరలో ఇటు తుషార్ మెహతా అటు కపిల్ సిబల్ మధ్య వాదనలు తారాస్థాయికి చేరాయి. తుషార్ మెహతా ప్రవేశపెట్టిన డాక్యుమెంట్లు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లని కపిల్ సిబల్ వాదించారు. ఇదిలా ఉంటే ఈడీ సీబీఐలు దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేయనుంది. అంతవరకు ఈడీ చిదంబరంను అదుపులోకి తీసుకోరాదని కోర్టు రూలింగ్ ఇచ్చింది.