కుమారస్వామికి మరో షాక్ : బలపరీక్షకు బీఎస్పీ దూరం, దిమ్మ తిరిగే షాకిచ్చిన మాయావతి
బెంగళూరు : మరికొన్ని గంటల్లో కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష .. అధికార పార్టీలో క్షణ క్షణం వణుకు. రెబల్స్ ఎలా దారిలోకి తెచ్చుకోవాలని శతవిధలా ప్రయత్నిస్తోంది. అయితే ఇంతలో భాగస్వామ్య పక్షం బీఎస్పీ నుంచి ఊహించని షాక్ తగిలింది. ఒకవేళ సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహిస్తే ఓటింగ్కు దూరంగా ఉంటామని ఆ పార్టీ ప్రకటించింది. ఉన్న వారిని ఎలా దారిలోకి తెచ్చుకోవాలని తలలు పట్టుకుంటున్న కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి మాయావతి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.
రసకందాయం ..
కర్ణాటక రాజకీయాలు పూటకో మలుపు తిరుగుతున్నాయి. రోజుకో ట్వీస్ట్తో ఉత్కంఠ రేపుతున్నాయి. రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాతో అంపశయ్య మీద ఉన్న కుమారస్వామికి బీఎస్పీ రూపంలో మరో దెబ్బ తగిలింది. సోమవారం జరిగే బలపరీక్షలో తమ పార్టీ ప్రతినిధి పాల్గొనబోరని బీఎస్పీ స్పష్టంచేసింది. దీనిని ఆ పార్టీ ఎమ్మెల్యే టీవీ ఎన్ మహేశ్ ధ్రువీకరించారు. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు తాను నడుచుకుంటానని స్పష్టంచేశారు. సోమ, లేదా మంగళవారాల్లో జరిగే బలపరీక్ష ఓటింగ్లో పాల్గొనబోనని తేల్చిచెప్పారు. ఆ రెండురోజులు తన నియోజకవర్గంలో ఉంటానని పేర్కొన్నారు. అంతేకాదు గత వారం రోజుల నుంచి జరుగుతన్న కర్ణాటక రాజీయాలకు మహేశ్ దూరంగా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరుకాలేదు.
బలపరీక్ష జరిగేనా ?
గురువారం మొదలైన బలపరీక్ష డ్రామా .. శుక్రవారం కూడా కొనసాగింది. తర్వాత సభ సోమవారానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. బలం నిరూపించాలని స్పీకర్ను గవర్నర్ వాజుభాయ్ వాలా కోరారు. తర్వాత సీఎం కుమారస్వామిని కూడా ఆదేశించారు. అయితే గవర్నర్ సూచనను స్పీకర్, కుమారస్వామి ధిక్కరించారు. అంతేకాదు సభ నియామాల ప్రకారం నడుచుకుంటామని, సభతో గవర్నర్కు సంబంధం లేదనేలా మాట్లాడారు. దీంతో సోమవారం ఎట్టి పరిస్థితుల్లో బలపరీక్ష జరిగే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ఓ వైపు, మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి.
ఆమోదిస్తే అంతే
ఒకవేళ స్పీకర్ కే ఆర్ రమేశ్ 15 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తే సంకీర్ణ ప్రభుత్వ మద్దతు 101కి చేరిపోతుంది. సభలో మెజార్టీ మార్క్కు కాస్తదూరంలో నిలిచిపోతోంది. అయితే మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనారోగ్య కారణాలతో సభకు హాజరవడం లేదు. దీంతో ప్రభుత్వ బలం 99కి చేరిపోతుంది. దీంతో బీఎస్పీ ఎమ్మెల్యే మహేశ్ కూడా దూరంగా ఉంటానని ప్రకటించడంతో ఆ సంఖ్య 88కి చేరనుంది. మొత్తం 16 మంది రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వారిలో 13 మంది కాంగ్రెస్ సభ్యులు కాగా .. 3 జేడీఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆర్ శంకర్, హెచ్ నగేశ్ కూడా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో కుమారస్వామి పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది. మరోవైపు బీజేపీ బలం కూడా తగ్గింది. బీజేపీ సభ్యుల సంఖ్య 105 కాగా .. శంకర్ అనే ఇండిపెండెంట్ సభకు హాజరవడం లేదు. అయితే తనకు విపక్ష స్థానంలో సీటు కేటాయించాలని కోరినట్టు స్పీకర్ కార్యాలయ వర్గాలు ధ్రవీకరించాయి.