టాటా గ్రూప్ సంస్థల అధినేత సైరస్ మిస్త్రీకి బిగ్ షాక్: ఛైర్మన్ పదవిని వదులుకోక తప్పదు
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ సంస్థల ఛైర్మన్ సైరస్ మిస్త్రీకి చుక్కెదురైంది. లక్షల కోట్ల రూపాయల టర్నోవర్ను సాధిస్తోన్న టాటా గ్రూప్ సంస్థల ఛైర్మన్ పదవికి ఎసరు పడింది. జాతీయ పారిశ్రామిక న్యాయ అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఇదివరకు జారీ చేసిన ఉత్తర్వులపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. సైరస్ మిస్త్రీకి నోటీసులను జారీ చేసింది. ఫలితంగా- సైరస్ మిస్త్రీ తన హోదా నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అప్పిలేట్ ట్రైబ్యునల్ నుంచి అనుకూంగా..
టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్గా పనిచేసిన సైరస్ మిస్త్రీని యాజమాన్యం అర్ధాంతరంగా తొలగించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన కంపెనీ అప్పిలేట్ ట్రైబ్యునల్లో పిటీషన్ను దాఖలు చేశారు. ఎలాంటి కారణం చూపకుండానే. తన కాల వ్యవధి తీరకుండానే.. అర్ధాంతరంగా తనను తప్పించారంటూ మిస్త్రీ గతంలో దాఖలు చేసిన పిటీషన్పై అప్పిలేట్ ట్రైబ్యునల్ సానుకూలంగా స్పందించింది.
సుప్రీంలో సవాల్ చేసిన రతన్ టాటా
టాటా సన్స్ ఛైర్మన్గా మిస్త్రీ పునర్నియామకానికి గల అడ్డంకులను తొలగిస్తూ తీర్పు వెలువడించింది. కిందటి నెల 18వ తేదీన ఈ తీర్పు వెలువడింది. ఆ వెంటనే- ఆయన బాధ్యతలను కూడా స్వీకరించారు. కంపెనీ అప్పిలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై వ్యవస్థాపకుడు రతన్ టాటా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ను దాఖలు చేశారు.
స్టే మంజూరు చేస్తూ..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటీషన్పై గురువారం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదోపవాదాలను ఆలకించింది. అనంతరం- అప్పిలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై స్టే జారీ చేసింది. ఎస్ ఏ బొబ్డే సహా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బీఆర్ గవాయ్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులను ఇచ్చింది. అప్పిలేట్ ట్రైబ్యునల్ జారీ చేసిన ఉత్తర్వుల్లో సాంకేతిక పరమైన దోషాలు ఉన్నాయని పేర్కొంది.