కాంగ్రెస్ పార్టీకి షాక్: రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యే
దిస్పూర్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవంపాలైన అస్సాం కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మరియాని ఎమ్మెల్యే రూప్జ్యోతి శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే బీజేపీలో చేరతానంటు ఆయన ప్రకటించారు. అంతేగాక, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం వల్లే తాను పార్టీ మారుతున్నట్లు వ్యాఖ్యానించారు.
టీ కమ్యూనిటీ నేత అయిన ఆయన అస్సాం అసెంబ్లీ స్పీకర్ బిశ్వజిత్ డైమరీకి తన రాజీనామా లేకను అందజేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ ప్రెసిడెంట్ సోనియా గాంధీకి పంపినట్లు రూప్ జ్యోతి తెలిపారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కుర్మి.. జూన్ 21న బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
కాగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ కుర్మీని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కూడా కుర్మీని పార్టీ నుంచి తొలగింపునకు ఆమోద ముద్ర వేసిందని అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రిపున్ బోరా తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రానా గోస్వామి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం మరియాని నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని సమీక్షిస్తోంది.
Recommended Video
కాగా, టీ ట్రైబ్ కమ్యూనిటీకి చెందిన ప్రముఖ నేత రూప్ జ్యోతి కుర్మి. మాజీ మంత్రి రూపమ్ కుర్మి కుమారుడే ఈ రూప్ జ్యోతి. 2006 నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వస్తున్నారు. ఇటీవల జరిగి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హిమంత బిశ్వశర్మ అస్సాం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.