మమతకు కలకత్తా హైకోర్టు షాక్-ఎన్నికల తర్వాత హింసపై ఎన్హెచ్ఆర్సీ విచారణ
పశ్చిమబెంగాల్లో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. వరుసగా మూడోసారి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. అయితే హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో తృణమూల్ విజయంతో ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఎన్నికల్లో తమకు గట్టిపోటీ ఇచ్చిన బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. దీంతో దాదాపు 12 మంది బీజేపీ కార్యకర్తలు చనిపోయారు.
పశ్చిమబెంగాల్ ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసపై కేంద్రం నివేదిక కోరినా, గవర్నర్ ఆక్షేపణ తెలిపినా స్పందించని మమతా బెనర్జీ సర్కారుకు ఎన్హెచ్ఆర్సీ షాకిచ్చింది. ఎన్నికల తర్వాత హింసపై దర్యాప్తుకు సిద్ధమైంది. అయితే దీన్ని సవాల్ చేస్తూ కలకత్తా హైకోర్టును ఆశ్రయించిన మమతా సర్కారుకు చుక్కెదురైంది. ఈ పిటిషన్ను విచారించిన ఐదుగురు సభ్యుల హైకోర్టు ధర్మాసనం... మమతా సర్కార్ అభ్యర్దనను తోసిపుచ్చింది. జూన్ 18న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సంతృప్తి పర్చడంలో బెంగాల్ సర్కార్ విఫలమైనందున ఎన్హెచ్ఆర్సీ విచారణకు ఇచ్చిన ఆదేశాలు అమలవుతాయని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
Recommended Video
ఎన్నికల హింసను అరికట్టడంలో తమ ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని కోర్టుకు వివరించేందుకు తగినంత సమయం ఇవ్వలేదని మమతా బెనర్జీ సర్కారు ఆక్షేపించింది. అయితే హైకోర్టు ఈ వాదనను పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఏడుగురు సభ్యుల ఎన్హెచ్ఆర్సీ బృందం బెంగాల్లో ఎన్నికల అనంతర హింసపై విచారణ జరపబోతోంది. దీన్నిఅడ్డుకునేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో మమతా బెనర్జీ సర్కారు ఇరుకునపడక తప్పలేదు.