ఢిల్లీ హైకోర్టులో జకీర్కు ఎదురుదెబ్బ: నిషేధాన్ని సమర్థిస్తూ తీర్పు..
దేశ భద్రత రీత్యా కేంద్రం ఐఆర్ఎఫ్ నిషేధించిందని జస్టిస్ సంజీవ్ సచ్దేవ వెల్లడించారు.
ఢిల్లీ: ఇస్లాం మతబోధకుడు జకీర్నాయక్కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్(ఐఆర్ఎఫ్)పై కేంద్రం నిషేధం విధించగా.. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జకీర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
జకీర్ తరుపు న్యాయవాది వాదనలతో ఏకీభవించని కోర్టు ఆయన పిటిషన్ ను కొట్టివేసింది. దేశ భద్రత రీత్యా కేంద్రం ఐఆర్ఎఫ్ నిషేధించిందని జస్టిస్ సంజీవ్ సచ్దేవ వెల్లడించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఏకపక్షంగా, అక్రమంగా తీసుకున్నది కాదని జస్టిస్ తెలిపారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వద్ద ఉన్నాయని తెలియజేశారు.
కాగా, ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్(ఐఆర్ఎఫ్)పై కేంద్రం నిషేధం విధించిన నిషేధంపై 2016, నవంబరు 17న జకీర్ నాయక్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపించేలా జకీర్ ప్రసంగాలు ఉన్నాయని, అందువల్లే ఐఆర్ఎఫ్ పై నిషేధం విధించాల్సి వచ్చిందని ప్రభుత్వం ఢిల్లీ న్యాయస్థానానికి నివేదించింది. దీంతో ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ జకీర్ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది.