ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు మృతి, విహారయాత్రలో ఇద్దరు
బెంగళూరు/అనంతపురం: కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లా శిర సమీపంలోని చిక్కనహళ్లి వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు వలస కూలీలు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బెళగావి ప్రాంతం నుంచి బెంగళూరుకు కూలీ పనుల కోసం వీరందరూ వ్యానులో వస్తుండగా వాహనం టైరు పంక్చరయింది.
అదే సమయంలో చిత్రదుర్గ వైపు నుంచి వేగంగా వచ్చిన ఓ లారీ ఆ వ్యానును ఢీకొని 150 అడుగుల దూరం లాక్కెళ్లింది. దీంతో అందులోఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారు. మృతులంతా మాన్వి తాలూకా హిరేబాదర్దిన్నె వాసులని తెలిసింది.
మృతులను లక్ష్మీ (28), అంజనమ్మ (22), జీపు డ్రైవర్ పూజ (35), మరియమ్మ (55)లుగా గుర్తించారు. 30 ఏళ్ల వ్యక్తితోపాటు మరో ఇద్దరి వివరాలు తెలియరాలేదు. గాయపడ్డ వెంకటేశ్ పరిస్థితి విషమంగా ఉంది. లారీ డ్రైవర్ కనకరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
విహారయాత్రలో విషాదం: ఇద్దరు మృతి
అనంతపురం: పెనుకొండ పట్టణంలోని భోగసముద్రం చెరువులో విహారయాత్ర కోసం వచ్చిన బెంగళూరుకు చెందిన ఇద్దరు విద్యార్థులు బాబు (18), మనోహర్ (19) ఈత కొడుతూ ప్రమాదవశాత్తు మునిగిపోయి మృతి చెందారు. బెంగళూరుకు చెందిన వీరితో పాటు స్నేహితులు 12 మంది ఆదివారం పెనుకొండకు విహార యాత్ర కోసం వచ్చారు.
పెనుకొండ మండలం అడదాకులపల్లికి చెందిన మిత్రుడి ఇంటికి వెళ్లిన అనంతరం పెనుకొండ కొండపైకి వెళ్లే మార్గమధ్యలో భోగసముద్రంలో చెరువులో ఈతకు దిగి సరదగా పోటీ పడుతూ బురద, కంపచెట్లలో ఇరుక్కుపోయారు. అయితే ఎంత సేపటికీ వారు బయటకు రాకపోవడంతో తోటి స్నేహితులు ఆందోళనకు గురై అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు.
అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులు బెంగళూరుకు చెందిన శేషాద్రిపురం ప్రాంతవాసులు కాగా, ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు తోటి స్నేహితులు తెలిపారు. విహార యాత్ర కోసం వచ్చిన విద్యార్థులు ఇలా అకాల మృత్యువుకు గురి కావడంతో స్థానికులతో పాటు స్నేహితులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.