మరోసారి తమ పవరేంటో నిరూపించిన తెలంగాణ పోలీస్.. 24గంటల్లోనే 'ముత్తూట్' దోపీడి దొంగల అరెస్ట్
తెలంగాణ పోలీసులు పవర్ఫుల్ అని మరోసారి నిరూపించుకున్నారు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరులోని ముత్తూట్ ఫైనాన్స్లో దోపిడీకి పాల్పడిన అంతరాష్ట్ర దొంగల ముఠాను 24గంటల్లోనే తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. తమిళనాడు పోలీసులతో కలిసి సంయుక్తంగా ఈ ఆపరేషన్ని చేపట్టినట్లు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే... శుక్రవారం(జనవరి 22) ఉదయం 9.30గంటలకు సాయుధులైన ఐదుగురు గ్యాంగ్ హోసూరులోని ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలోకి చొరబడ్డారు. అక్కడి సిబ్బందిని గన్స్తో బెదిరించి రూ.7.5కోట్లు విలువ చేసే 25కేజీల బంగారంతో పాటు రూ.96వేలు నగదును దోచుకెళ్లారు. దోపిడీ సమయంలో ముఠా సభ్యులంతా తమ ముఖాలు కనిపించకుండా ముసుగులతో కవర్ చేసుకున్నారు. అంతేకాదు,దోపిడీ అనంతరం అక్కడి సీసీటీవీ కెమెరాలను కూడా ఎత్తుకెళ్లారు.
ముఠా కదలికలను అంచనా వేసిన తమిళనాడు పోలీసులు వెంటనే కర్ణాటక,తెలంగాణ పోలీసులకు కూడా సమాచారమిచ్చారు. ఈ మూడు రాష్ట్రాల పోలీసులు ఎప్పటికప్పుడు ఫోన్ల ద్వారా సమాచారాన్ని పంచుకుంటూ ముందుకు కదిలారు. శుక్రవారం రాత్రి తెలంగాణ పోలీసులు దాదాపు 100 మంది పోలీస్ సిబ్బందితో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. షాద్నగర్,రాయికల్,మేడ్చల్,శంషాబాద్ల వద్ద వాహనాల రాకపోకలపై నిఘా పెట్టారు.
Recommended Video
తెల్లవారుజామున 3గం. సమయంలో కర్నూలు హైవేపై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ టాటా సుమోను గుర్తించారు. ఎట్టకేలకు తొండుపల్లి గేట్ ప్లాజా వద్ద కారులో వెళ్తున్న ఐదుగురు దోపిడీ దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి గన్స్,నగదు,బంగారం స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషరేట్లలోని సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడం వల్లే ఈ చోరీ కేసును చేధించామని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు.గతంలో ఇదే తొండుపల్లి టోల్ ప్లాజా సమీపంలో దిశా హత్యాచార ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.