ఊటీలో బస్సు బోల్తా: ఏడుగురు మృతి, 30మందికి గాయాలు
చెన్నై: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఊటీలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఊటీ నుంచి కన్నూరుకు వెళ్లే మార్గంలో 50 అడుగుల లోయలో తమిళనాడు ఆర్టీసీ బస్సు పడిపోయింది.
బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఏడుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో 30మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 8మంది విషమంగా ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
భారీ వర్షాల కారణంగా ఘాట్ రోడ్డులో రహదారి ప్రమాదకరంగా ఉన్నప్పటికీ.. బస్సు డ్రైవర్ బస్సును వేగంగా తీసుకెళ్లడంతో అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే 20మంది వరకు మృతి చెందారు. కర్ణాటకలోని బెల్గావ్లో ముగ్గురు వ్యక్తులు వరదల్లో చిక్కుకున్నారు.