వలస కార్మికుల తరలింపు.. అసాధ్యమన్న 7 రాష్ట్రాలు.. ప్రత్యేక రైళ్లకు డిమాండ్..
లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికులు,కూలీలు,విద్యార్థులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని ఏడు రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ఇది అసాధ్యమని,లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయినవారిని తరలించాలంటే కచ్చితంగా రైళ్లు నడపాల్సి వస్తుందని చెప్పాయి. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ,కేరళ,తమిళనాడు,మహారాష్ట్ర,రాజస్తాన్,పంజాబ్,బీహార్ ఉన్నాయి.
మొదట కేరళ ప్రభుత్వం అభ్యంతరం..
ఈ అంశంపై కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాష్ట్రాల సీఎస్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో చర్చించారు. ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వం మొదట దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ సొంత రాష్ట్రాలకు బయలుదేరడానికి సిద్దంగా ఉన్నవారిని తరలించేందుకు ప్రత్యేక నాన్-స్టాప్ రైళ్లు కావాలని డిమాండ్ చేసింది. ఒక్క తమ రాష్ట్రంలోనే 3.60లక్షల మంది వలస కార్మికులు 20వేల క్యాంపుల్లో ఆశ్రయం పొందుతున్నారని తెలిపింది. వీరంతా వారి స్వస్థలాలకు వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నారని.. అయితే దక్షిణాది నుంచి ఉత్తరాదిలోని తమ రాష్ట్రాలకు చేరుకోవాలంటే.. వీరు చాలా దూరం ప్రయాణించాలని పేర్కొంది. బస్సుల ద్వారా ఇది సాధ్యపడదని.. పైగా వైరస్ వ్యాప్తికి అవకాశం కూడా ఉంటుందని తెలిపింది.
రాజస్తాన్,పంజాబ్ కూడా..
రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. వేలాది మంది కార్మికులను తరలించడం అసాధ్యమైన పని అన్నారు. అటు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఒక్క లూథియానాలోనే దాదాపు 7లక్షల మంది వలస కార్మికులు ఉన్నారని... రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మంది ఉంటారని చెప్పారు. వీళ్లలో చాలామంది బీహార్ నుంచి వచ్చినవాళ్లేనని.. ఇంతమందిని బస్సుల్లో పంపించడం సాధ్యం కాదని అన్నారు. కాబట్టి రైళ్ల ద్వారానే వీళ్ల తరలింపు సాధ్యపడుతుందని.. అది కూడా సరైన స్క్రీనింగ్ టెస్టులు,ఇతరత్రా జాగ్రత్తలు అవసరమని చెప్పారు.
తెలంగాణ,బీహార్ అదే దారిలో..
తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దీనిపై మాట్లాడుతూ.. తెలంగాణలో దాదాపు 15లక్షల మంది వలస కార్మికులు ఉన్నారని చెప్పారు. వీళ్లంతా బీహార్,జార్ఖండ్,ఛత్తీస్ఘడ్ రాష్ట్రాలకు చెందినవారని.. ఇక్కడినుంచి బస్సుల్లో స్వస్థలాలకు చేరుకోవాలంటే కనీసం 3 నుంచి 5 రోజులు పడుతుందని చెప్పారు. ఇంతమంది వలస కార్మికులు,కూలీలను బస్సుల్లో తరలించమని కేంద్రం చెప్పడం సరికాదన్నారు. బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ కూడా ఇదే అభిప్రాయపడ్డారు. రోడ్డు మార్గం ద్వారా వలస కార్మికులను తరలించాలంటే.. మనకున్న రవాణా వనరులు సరిపోవని.. అందరినీ తరలించడానికి నెలల సమయం పడుతుందని అన్నారు.
తమిళనాడు,మహారాష్ట్ర కూడా...
తమిళనాడు ప్రభుత్వం కూడా ఇది సరైన నిర్ణయం కాదని చెప్పింది. తమ రాష్ట్రంలో దాదాపు 4లక్షల వలస కార్మికులు ఉన్నారని.. ఎక్కువమంది బీహార్,పశ్చిమ బెంగాల్ తెలిపింది.ఇక దేశంలోనే అందరికంటే ఎక్కువ వలస కార్మికులను కలిగిన ముంబై లాంటి నగరం నుంచి వారందరినీ బస్సుల ద్వారా స్వస్థలాలకు తరలించడం సాధ్యపడదని మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అభిప్రాయపడింది. వలస కార్మికులను తరలించాలంటే.. ప్రత్యేకంగా నాన్-స్టాప్ రైళ్లు ఏర్పాటు చేయాల్సిందేనని చాలా రాష్ట్రాలు అభిప్రాయపడ్డాయి. అందులో ఆహారం,నీళ్లు అందిస్తూ.. సోషల్ డిస్టెన్స్ వంటి చర్యలు పాటిస్తూ ప్రయాణికులు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.