ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. కానీ, కరోనా ముందు ఓడిన ఎమ్మెల్యే ప్రదీప్
భువనేశ్వర్: కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్న ప్రజాప్రతినిధులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాకా, ఒడిశాలో బిజూ జనతాదళ్(బీజేడీ) పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రదీప్ మహారథి(65) కరోనా సోకి కన్నుమూశారు. ఈయన రాష్ట్రంలోని పిపిలి నియోజకవర్గం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
పూరీ జిల్లాలోని పిపిలి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రదీప్ మహారథికి సెప్టెంబర్ 14న కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందిన ఎమ్మెల్యే ప్రదీప్.. త్వరగానే కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రెండ్రోజుల క్రితమే మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
ఈ క్రమమంలో తిరిగి ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే ప్రదీప్ మహారథి పరిస్థితి విషమించడంతో ఆదివారం మరణించారని వైద్యులు తెలిపారు.
కాగా, విద్యార్థి సంఘం నేతగా ప్రదీప్ 1985లో జనతాదళ్ పార్టీలో చేరి పిపిలి నుంచి అసెంబ్లీకి తొలిసారిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటైన బిజూ జనతాదళ్ పార్టీలో చేరారు. 1985 నుంచి ఇప్పటి వరకు పిలిపి నియోజకవర్గంలో జరిగిన ఎనిమిది ఎన్నికల్లో ఏడుసార్లు ప్రదీప్ విజయం సాధించారు. దీంతో అక్కడ తిరుగులేని నాయకుడిగా ఎదిగారు.
Recommended Video
అంతేగాక, బీజేడీ ప్రభుత్వంలో పలు మార్లు మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ప్రదీప్ ఎంతగానో శ్రమించారు. ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని చెప్పిన ఆయన.. చివరకు ఆ మహమ్మారి బారినే పడి మరణించారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సహా అన్ని రాజకీయ పార్టీల నేతలు సంతాపం తెలిపారు.