శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లాలోని క్వారీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు మరణించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారన్న విషయం ఇప్పటికైతే చెప్పలేమని, బాగా చీకటిగా ఉందని పోలీసులు చెబుతున్నారు. అయితే, 15 మంది మృతి చెందినట్లు, పదుల సంఖ్యలో గాయపడినట్లు అనధికారిక సమాచారం.
Recommended Video
భారీ శబ్ధంతో పేలుడు.. వణికిన జనం
కాగా, భారీ శబ్ధం రావడంతో స్థానిక ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అబ్బలగిరి గ్రామానికి సమీపంలోని హునసోండి క్వారీలో ఈ పేలుడు సంభవించినట్లు చెబుతున్నారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ను ఘటనా స్థలానికి పిలిపించారు.
ఇరుగుపొరుగు జిల్లాల్లోనూ ప్రకంపనలు
ఆ ప్రాంతం మొత్తం పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గురువారం రాత్రి 10.20 గంటలకు ఈ పేలుడు సంభవించినట్లు తెలిసింది. సమీపంలోని చిక్కమంగళూరు జిల్లాలో కూడా ఈ పేలుడు ధాటికి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
భారీ శబ్ధం, భూమి కంపించినట్లుగా అనిపించడంతో ప్రజలు భయంతో తమ నివాసాల నుంచి బయటికి పరుగులు తీశారు. ఘటనా స్థలానికి భారీగా పోలీసు, సహాయ బృందాలు చేరుకున్నాయి. మృతులను, క్షతగాత్రులను బయటికి తీసే పనిలో నిమగ్నమయ్యాయి. మృతుల సంఖ్య భారీగానే ఉండనుందని తెలుస్తోంది.కాగా, శివమొగ్గ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప సొంత జిల్లా కావడం గమనార్హం.