వాయు ఎఫెక్ట్! వణుకుతున్న ముంబై: విమానాశ్రయం మూత! పలు విమానాలు రద్దు, దారి మళ్లింపు!
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై గజ గజ వణికిపోతోంది. ఉగ్రవాదుల దాడుల భయంతో కాదు.. తుఫాను ప్రభావంతో! అరేబియా సముద్రంలో ఏర్పడిన పెను తుఫాను ప్రభావంతో ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ ఎడతెరిపి లేకుండా ఏకధాటిగా వర్షం కురిసింది. పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. పలు విమానాలను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫానుకు సీఎస్ వాయుగా నామకరణం చేశారు.
కనిపించని రన్వే..
ముంబైలో కురుస్తున్న భారీవర్షంతోపాటు దట్టమైన నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. ఫలితంగా స్పష్టత లోపించింది. ఎదురుగా ఏ వాహనం ఉన్నదో కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఇక్కడి నుంచి రాకపోకలు సాగించాల్సిన 11 విమానాలను దారి మళ్లించారు. ముంబైలో దిగాల్సిన కొన్ని విమానాలను న్యూఢిల్లీకి పంపించారు.
విమానాలు దారి మళ్లింపు..
న్యూయార్క్ నుంచి ముంబైకి వచ్చిన విమానాన్ని ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. ఢిల్లీ నుంచి ముంబైకి బయలుదేరి వచ్చిన విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన యుకె 985 విమానాన్ని గుజరాత్లోని అహ్మదాబాద్కు మళ్లించారు. విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న థాయ్ ఎయిర్వేస్కు చెందిన విమానం.. ఎదురుగా ఏముందో కనిపించక గార్డ్ లైట్ హౌస్ను ఢీ కొట్టింది.
రుతు పవనాలకు తోడు తుఫాను
సుమారు ఎనిమిదిరోజుల పాటు ఊరించిన నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకడం, ఆ వెంటనే అవి విస్తరించడం, అదే సమయంలో అరేబియా సముద్రంలో ఆగ్నేయ దిశలో ఏర్పడిన అల్పపీడనం.. తుఫానుగా రూపాంతరం చెందడం చకచకా జరిగిపోయాయి. రుతుపవనాలకు తుఫాను తోడు కావడం వల్ల దాని ప్రభావం ముంబైపై పడింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడ కురుస్తున్నాయి.
48 గంటల్లో పెను తుఫానుగా..
అరేబియా సముద్రంలో ముంబైకి ఆగ్నేయ దిశగా సుమారు 540 నాటికన్ మైళ్ల దూరంలో కేంద్రీకృతమైన తుఫాన్.. క్రమంగా బలపడే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అనంతరం- క్రమంగా ఇది ముంబై వైపు కదులుతుందని, దాని వేగం గంటకు సుమారు 10 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని అంచనా వేశారు. దీని ప్రభావం వల్లే ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల ముంబై అతలాకుతలమౌతోంది. విమానాలతో పాటు సబర్బన్ రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. శాంతాక్రజ్, మలాద్, కండివలి, బోరివలి, కుర్లా, ఘట్ కోపర్, విఖ్రోలి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.