మధుకాన్తోపాటు 78 భారతీయ కంపెనీలపై ప్రపంచ బ్యాంక్ నిషేధం, కారణమిదే
వాషింగ్టన్: మోసాలకు పాల్పడిన పలు భారతీయ కంపెనీలపై ప్రపంచ బ్యాంక్ నిషేధం విధించింది. ఆయా కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేసినట్లు ప్రపంచ బ్యాంక్ వార్షిక నివేదిక ద్వారా స్పష్టం చేసింది.
భారత్ కు చెందిన ఆలివ్ హెల్త్కేర్, జై మోడీ కంపెనీలు అవినీతికి పాల్పడుతున్నట్లు సమాచారం రావడంతో వాటిని నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. ప్రపంచ బ్యాంక్ నిధులతో ఈ కంపెనీలు బంగ్లాదేశ్లో ప్రాజెక్టులు నిర్వహిస్తున్నాయి.. ఆలివ్ హెల్త్కేర్పై పదేళ్ల6నెలలపాటు, జై మోడీ కంపెనీపై ఏడేళ్ల6నెలలపాటు నిషేధం విధించినట్లు తెలిపింది.
మొత్తం 78 భారతీయ కంపెనీలపై ప్రపంచ బ్యాంక్ నిషేధం విధించింది. భారత్కు చెందిన ఏంజెలిక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్పై నాలుగేళ్ల ఆరునెలలు నిషేధం విధించింది. ఈ కంపెనీ ప్రపంచ బ్యాంక్ నిధులతో ఇథియోపియా, నేపాల్లో ప్రాజెక్టులు నిర్వహిస్తోంది.
అవినీతికి పాల్పడుతుందనే కారణంతో అర్జెంటీనా, బంగ్లాదేశ్లో ప్రాజెక్టులను నిర్వహిస్తోన్న ఫ్యామిలీ కేర్పై నాలుగేళ్లు నిషేధం విధించింది. భారత్లో ప్రాజెక్టులు నిర్వహిస్తున్న మధుకాన్ ప్రాజెక్ట్ లిమిటెడ్పై రెండేళ్లు, ఆర్కేడీ కన్స్ట్రక్చన్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఏడాది6నెలలపాటు నిషేధం విధించినట్లు ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో వెల్లడించింది.
అంతేగాక, తత్వే గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ఎంఈసీ(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, మాక్లోడ్స్ ఫార్మాసిటికల్స్ లిమిటెడ్పై ఏడాది కంటే తక్కువ కాలం నిషేధం విధించారు. ఈ 78కంపెనీలే కాకుండా మరో ఐదు కంపెనీలపైనా ఆంక్షలతో కూడిన నిబంధనలను విధించింది ప్రపంచ బ్యాంక్.