మోడీ సభలో అపశృతి: తొక్కిసలాటలో పలువురు మహిళలకు, చిన్నారులకు గాయాలు
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాని మోడీ బెంగాల్లో తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ముందుగా ఠాకూర్నగర్ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే మోడీని చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. తొక్కిసలాటలో పలువురు మహిళలకు చిన్నపిల్లలకు గాయాలయ్యాయి. మతువా సామాజికవర్గానికి చెందిన వారిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగిస్తున్న సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుందని పోలీసులు చెప్పారు.
కార్యకర్తలు అభిమానులు ప్రజలతో సభాప్రాంగణం నిండిపోవడంతో చాలామంది బయటే ఉన్నారు. అయితే లోపలికి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. అదే సమయంలో తొక్కిసలాట ప్రారంభమైంది. అయితే ఇది గమనించిన ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపివేసి వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. ఎక్కడి వారు అక్కడే కూర్చోవాలని పదేపదే చెప్పినప్పటికీ ఎవరూ వినకపోవడంతో తొక్కిసలాట తీవ్రంగా మారింది. దీంతో ప్రధాని తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపివేశారు. మరోవైపు వచ్చిన ప్రజలు కుర్చీలు విసరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
కుర్చీలు విసరడం ఆపై తొక్కిసలాట చోటుచేసుకోవడంతో మహిళలు చిన్నపిల్లలు గాయపడ్డారు. కొందరు స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే వారిని ప్రాథమిక చికిత్స కోసం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అయితే తన ర్యాలీకి చాలామంది ప్రజలు రావడం సంతోషకరమైన విషయమే అయినప్పటికీ వారికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానని చెప్పారు ప్రధాని మోడీ. దీంతో తన ప్రసంగాన్ని తక్కువ సమయానికే కుదించి అక్కడి నుంచి మరో బహిరంగసభకు బయలుదేరి వెళ్లారు.