దసరా, దీపావళి మహా సేల్: అమ్మకానికి ప్రభుత్వరంగ సంస్థలు: లక్ష కోట్ల పైమాటే
న్యూఢిల్లీ: దసరా, దీపావళి సీజన్ వచ్చిందంటే కొనుగోలుదారులకు పండగే. ఎందుకంటే- ఈ సీజన్ లో అన్ని రకాల వస్తువుల ధరలు కాస్తో, కూస్తో తగ్గుతాయి. మహా సేల్స్ అంటూ రాయితీలు ప్రకటిస్తాయి. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటూ ఊదరగొడతాయి కాబట్టి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా ఫక్తు ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. తన ఆధీనంలో ఉన్న కొన్ని సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించడానికి లైన్ క్లియర్ చేసుకుంది. డిజిన్వెస్ట్ మెంట్ కోసం ఏర్పాటు చేసిన కార్యదర్శుల కమిటీ.. ఓ నాలుగు సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరణకు సోమవారమే ఆమోదం తెలియజేసింది.
బీపీసీఎల్ సహా..
కార్యదర్శుల కమిటీ తాజాగా పెట్టుబడులను ఉపసంహరించడానికి ఆమోదం తెలియజేసిన సంస్థల్లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) కూడా ఉంది. ఈ సంస్థతో పాటు భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్), కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సీఐ), ప్రభుత్వరంగంలోని విద్యుత్ ఉత్పాదక సంస్థలు టీహెచ్డీసీ ఇండియా లిమిలెడ్, నీప్కో ఇండియా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పని చేస్తోన్న పౌర విమానయాన సంస్థ ఎయిరిండియా ఎలాగూ ఉండనే ఉంది. సోమవారం డిజిన్వెస్ట్ మెంట్ కు ఆమోద ముద్ర లభించడం దసరా, దీపావళి పండుగ సీజన్ వాటన్నింటినీ అమ్మకానికి పెట్టినట్టయిందని అంటున్నారు మార్కెట్ నిపుణులు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం టార్గెట్.. లక్ష కోట్ల పైమాటే
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే.. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ముగిసే 2018-2019 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్న పెట్టుబడుల ఉపసంహరణ మొత్తం లక్ష కోట్ల రూపాయల మార్క్ ను దాటేసింది. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే కనీసం 1,05,000 కోట్ల రూపాయల మేర డిజిన్వెస్ట్ మెంట్ చేయాలని టార్గెట్ గా చేసుకుంది. ఇందులో ఒక్క భారత్ పెట్రోలియంలోనే 55 వేల కోట్ల రూపాయల మేర పెట్టబడుల ఉపసంహరణ ఉండొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి 53 శాతం పెట్టుబడులను ఉన్నాయి. దీన్నంతటినీ ఉపసంహరించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వం వాటాను కొనుగోలు చేయడానికి వచ్చే సంస్థలేవైనా ఉంటే 65 వేల కోట్లుగా నిర్ధారించవచ్చని తెలుస్తోంది.