ఉగ్రదాడిః మాటలకు అందని మహా విషాదం..అమర జవాన్లకు సోషల్ మీడియా జోహార్
కాశ్మీర్ః జమ్మూ కాశ్మీర్ రాజధానికి సరిగ్గా 20 కిలోమీటర్ల దూరంలో అన్న అవంతిపురా వద్ద గురువారం మధ్యాహ్నం కేంద్రీయ రిజర్వ్ పోలీసు బలగాల కాన్వాయ్ పై ఉగ్రవాదులు చేసిన మహోగ్రదాడి పట్ల దేశం యావత్తూ విస్తుపోయింది. 2500 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వెళ్తున్న ఈ కాన్వాయ్పై ఆధునికీకరించిన పేలుడు పదార్థాలతో ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో 20 మంది జవాన్లు అమరులయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడి తమ పనేనంటూ జైషె మహమ్మద్ ప్రకటించుకుంది.
ఉగ్రవాదుల దాడి ఘటన దేశాన్ని కదిలించింది. రాజకీయ నాయకులు సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సాధారణ నెటిజన్లు వరుసగా ట్వీట్లను సంధించారు. వందల సంఖ్యలో ట్వీట్లు వెలువడ్డాయి. ఈ దాడిలో అమరులైన జవాన్లకు కన్నీటి నివాళి అర్పించారు. తమ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్త పరిచారు. ఈ దాడిని మాటలకు అందని మహా విషాదంగా అభివర్ణించారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ల ద్వారా పదుల సంఖ్యలో నెటిజన్లు తమ సానుభూతిని వెల్లడించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోమ్ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు ట్వీట్ల ద్వారా తమ విషాదాన్ని పంచుకున్నారు.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ సీనియర్ నేత రణ్దీప్ సూర్జేవాలా, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఇలా పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. అమర జవాన్ల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
దాడి జరిగినట్లు సమాచారం అందిన వెంటనే, దాని గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. దాడికి కారణమైన ఉగ్రవాదులను మట్టుబెట్టాలని నినదించారు. దీనికోసం అవసరమైతే మరోసారి యూరీ సెక్టార్ తరహాలో సర్జికల్ స్ట్రైక్ చేపట్టాలని నెటిజన్లు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. రాజధానికి 20 కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద ఎత్తున ఉగ్రవాదులు దాడి చేస్తే.. జాతీయ భద్రతా సంస్థ ఏం చేస్తోందని నిలదీశారు. జాతీయ భద్రతా సలహాదారు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తమ లబ్ది కోసం రాజకీయ నాయకులు చేస్తోన్న ప్రయత్నాలకు అత్యంత విలువైన జవాన్ల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.