మోడీ కేబినెట్ ఇన్ యాక్షన్: బాధ్యతలు స్వీకరించిన కొత్త మంత్రులు
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేబినెట్లోని పలువురు మంత్రులు యాక్షన్లోకి దిగిపోయారు. బాధ్యతలను చేపట్టారు. అధికారులతో సమీక్షలు చేపట్టారు. కీలక అంశాలపై చర్చించారు. విధానపరమైన నిర్ణయాలకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అత్యంత కీలకమైన విదేశాంగ శాఖను తన భుజాలపైకి ఎత్తుకున్న సుబ్రహ్మణ్యం జైశంకర్ అందరి కంటే ముందుగా బాధ్యతలను స్వీకరించడం గమనార్హం. ఇదంతా- మంత్రుల పోర్ట్ ఫోలియోలను ప్రకటించిన రెండు గంటల వ్యవధిలోనే చోటు చేసుకుంది.
మొత్తం 57 మంది మంత్రులతో కొత్త కేబినెట్ కొలువు తీరిన విషయం తెలిసిందే. వారంతా- గురువారం సాయంత్రం దేశ రాజధానిలోని రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని సహా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో మొత్తం 57 మంది ఉన్నారు. వారిలో 24 మందికి కేబినెట్ హోదా దక్కింది. తొమ్మిది మందికి స్వతంత్ర హోదా ఉన్న సహాయ మంత్రులుగా నియమితులయ్యారు. మరో 24 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
మంత్రుల ప్రమాణ స్వీకారం ముగిసిన మరుసటి రోజే మధ్యాహ్నం ఒంటిగంటకు పోర్ట్ ఫోలియోలు విడుదలయ్యాయి. ఏ మంత్రికి, ఏ శాఖలను కేటాయించారనే విషయంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఓ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోర్ట్ ఫోలియోల జాబితా విడుదలైన మరుక్షణమే కేంద్ర మంత్రులు ఒక్కొక్కరుగా తమ శాఖకు చెందిన కార్యాలయాలకు చేరుకోవడం కనిపించింది. మంత్రులు బాధ్యతలను స్వీకరిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీనితో వారు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేశారు.
అందరి కంటే ముందుగా- విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ తన శాఖా కార్యాలయానికి చేరుకున్నారు. ఎలాంటి ఆడంబరాలకూ పోలేదు. బాధ్యత స్వీకరణ కార్యక్రమాన్ని ముగించారు. ఆ తరువాత- పీయూష్ గోయల్ తన కార్యాలయానికి చేరుకున్నారు. బాధ్యతలను చేపట్టారు. ఆయనకు రైల్వే, వాణిజ్య పరిశ్రమల శాఖలను కేటాయించిన విషయం తెలిసిందే. ఆ కొద్దిసేపటికే అబ్బాస్ ముఖ్తార్ నక్వీ మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.
ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, జల్శక్తి శాఖ మంత్రి గజేంద్ర షెఖావత్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిషాంక్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తమ కార్యాలయాలకు చేరుకుని, బాధ్యతలను స్వీకరించారు.
ఈ సందర్భంగా వారికి ఆయా శాఖల ఉన్నతాధికారులు, విభాగాధిపతులు శుభాకాంక్షలు తెలిపారు. వారిలో చాలామంది మంత్రులు అధికారులతో సమీక్షా సమావేశాలను నిర్వహించారు. అసంపూర్తిగా ఉన్న ప్రతిపాదనలను తెప్పించుకుని పరిశీలించారు. వచ్చే నెలలో ప్రధానమంత్రి.. మాల్దీవులు, శ్రీలంక దేశాల పర్యటనకు వెళ్లాల్సి ఉన్నందున.. ఆ శాఖ మంత్రి జైశంకర్ దీనికి సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు. మరికొందరు మంత్రులు ఈ సాయంత్రానికల్లా తమ బాధ్యతలను స్వీకరించవచ్చని తెలుస్తోంది. శనివారం నాటి కల్లా మంత్రులందరూ తమ శాఖల బాధ్యతలను తీసుకుంటారని చెబుతున్నారు.