వెదర్ అలర్ట్ : ఢిల్లీలో వడగాలులు..తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
ఢిల్లీ: దేశవ్యాప్తంగా భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఉదయం ఏడు గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎండ వేడిమి తట్టుకోలేక ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎర్రటి ఎండకు దేశంలోని ప్రజలు పిట్టలు రాలినట్లు రాలుతున్నారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ దేశంలోని సగం ప్రాంతాలకు రెడ్అలర్ట్ ప్రకటించింది. హైఅలర్ట్ ప్రకటించిన రాష్ట్రాల్లో విదర్భా, పశ్చిమ రాజస్థాన్, తూర్పు ఉత్తర్ ప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్లు ఉన్నాయి. ఇప్పటికే తీవ్ర వడగాలులు వీస్తున్నాయని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణశాఖ.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉష్ణోగ్రతలు 46.8 డిగ్రీల సెల్సియస్ నమోదుకాగా శుక్రవారం 44.8 డిగ్రీల సెల్సియస్ నమోదు అయినట్లు వెదర్ డిపార్ట్ మెంట్ తెలిపింది. దీంతో ఢిల్లీలో వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.ఇక శనివారం 45 డిగ్రీల సెల్సియస్ నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఇక వాతావరణం తీవ్రతను సూచిస్తూ కలర్ కోడింగ్ ఇచ్చింది. గ్రీన్ కలర్, పసుపు కలర్, సాధారణ ఉష్ణోగ్రతలను సూచిస్తాయని, ఇక ఎరుపు రంగు మాత్రం ప్రమాదకర స్థాయిని సూచిస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది. 45 డిగ్రీల సెల్సియస్ను ఉష్ణోగ్రతలు తాకితే అప్పటి నుంచే ఎరుపు రంగు హెచ్చరికలు జారీ చేస్తారు. ఇక సోమవారం వడగాలులు తీవ్రస్థాయిలో వీచే అవకాశం ఉందని చెప్పిన వాతావరణ శాఖ అధికారులు ఇది మంగళవారం వరకు కొనసాగుతుందని చెప్పారు. ఇక రుతుపవనాలు జూన్ మధ్యవరకు ఉత్తరభారతంలోకి ప్రవేశింపవని అంచనా వేశారు.
ఇదిలా ఉంటే చంద్రాపూర్ విదర్భా ప్రాంతాల్లో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ రెండు ప్రాంతాల్లో టెంపరేచర్ 48 డిగ్రీల సెల్సియస్ను తాకిందని స్పష్టం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ చివరి వారంలో వడగాలులు వీచాయని ఆ తర్వాత ఇప్పుడే వీస్తున్నట్లు పూణేలోని వాతావరణకేంద్ర శాఖ అధికారులు తెలిపారు. ఇక ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని చెప్పారు. పశ్చిమ రాజస్థాన్లో ఎడారి ప్రాంతం నుంచి ఈ వడగాలులు వీస్తున్నాయని చెప్పారు. ఇక ఉత్తర్ ప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతంలో ఉన్న బండా అనే పట్టణంలో అత్యధికంగా 47.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు.
ఆకాశంలో మారుతున్న పరిస్థితులే అధిక ఉష్ణోగ్రతలకు కారణమవుతున్నట్లు కష్యపీ అనే వాతావరణశాఖ అధికారి తెలిపారు. ఆకాశంలో మబ్బులు లేకపోవడంతో సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకుతున్నాయని దీని ద్వారా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని వెల్లడించారు.