మళ్లీ నోరు జారిన శరద్ యాదవ్: 'ఆడపిల్లల కన్నా బ్యాలెటే ముఖ్యం'
ఆడపిల్లల కంటే బ్యాలెట్ పేపర్ చాలా ముఖ్యమని శరద్ యాదవ్ వ్యాఖ్యానించడం తీవ్ర వివాదస్పదమవుతోంది.
న్యూఢిల్లీ: ఓటుకు ఆడపిల్లలకు మధ్య పోలిక తెచ్చి.. ఆడపిల్ల కంటే బ్యాలెట్ పేపరే ముఖ్యమని జనతాదళ్ (యు) నేత, రాజ్యసభ సభ్యుడు శరద్ యాదవ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అసలే దేశంలో మహిళా భద్రత అంతంతమాత్రంగా ఉన్న పరిస్థితుల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపేవిగా మారాయి.
మహిళల రంగుపై సభలో గందరగోళం: స్మృతి ఇరానీపై శరద్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
మరో అడుగు ముందుకేసి మరీ.. ఈ వ్యాఖ్యలను మరింత వివాదస్పదం చేశారు శరద్ యాదవ్. ఎవరైనా అమ్మాయికి గౌరవ భంగం కలిగితే అది ఒక్క ఇంటికే పరిమితమని.. కానీ ఓటు గనుక అమ్ముడుపోతే అది దేశ గౌరవానికే భంగం కలిగిస్తుందని చెప్పారు. మీ ఓటు విలువ మీ కుమార్తె గౌరవం కంటే పెద్దది అని పేర్కొన్నారు. ఆడపిల్లల కంటే బ్యాలెట్ పేపర్ చాలా ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించడం తీవ్ర వివాదస్పదమవుతోంది.
గతంలోను పలుమార్లు నోరు జారిన శరద్ యాదవ్ ఆ తర్వాత నాలుక కరుచుకుని క్షమాపణలు చెప్పారు. ఓవైపు దేశంలో ఆడబిడ్డలను కాపాడుకుందాం అంటూ ఉత్సవాలు జరుగుతోంటే.. మరోవైపు ప్రజాప్రతినిధులే ఆడబిడ్డల గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం శోచనీయం.