ఆశారాం వద్దకు భార్యే అమ్మాయిలను పంపేది?
న్యూఢిల్లీ: ఇప్పటికే మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో వివాదాస్పద స్వామిజీ ఆశారాం బాపు అరెస్టై జోధ్పూర్ కేంద్ర కారాగారంలో జైలులో శిక్ష అనుభవిస్తుండగా... తాజా ఆరోపణలతో తన కుటుంబం మొత్తం న్యాయపరమైన ఇబ్బందుల్లో పడేట్లు కనిపిస్తోంది. ఇటీవల ఇద్దరు అక్కాచెల్లెల్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఆశారాం బాపు కుమారుడు నారాయణ సాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా ఆశారాం బాపు లైంగిక వ్యవహారాలకు సతీమణి లక్ష్మీ, కూతురు భారతీలు సహకరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆశారాం మొత్తం కుటుంబం చట్టపరమైన కేసుల్లో చిక్కుకున్నట్లయింది. ఆశారాం బాపు, అతని కుమారుడు నారాయణ సాయిలపై పోలీసులకు తాజాగా అందిన ఫిర్యాదు ప్రకారం ఆశారాం సతీమణి లక్ష్మి కొందరు అమ్మాయిలను ఎన్నుకుని రాత్రిపూట ఆశారాం గదికి పంపించేదని సమాచారం.
భార్య లక్ష్మి, కూతురు భారతిలు ఆ అమ్మాయిలకు సంబంధించిన వ్యవహారాలను చూసుకునే వారని ఫిర్యాదుదారు పేర్కొంది. ఆశారాం, నారాయణసాయిలు తమపై అత్యాచారం చేసినట్లు ఫిర్యాదుదారు ఆరోపించింది. నేపాల్లోని వారి ఆశ్రమంలో కొందరు మగ భాగస్వాముల మధ్య తమతో అశ్లీల నృత్యాలు చేయించేందుకు తీవ్ర ఒత్తిడి చేశారని ఫిర్యాదులో పేర్కొంది.
నారాయణసాయి తనపై గత కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నాడని పిర్యాదుదారు సోదరి ఆరోపించింది. నిజ నిర్ధారణ పరీక్షకు కూడా తాము సిద్ధమని వారు మీడియాకు తెలిపారు. ఆశారాం కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రమాదం ఉంటుందనే భయంతోనే ఇంతకాలం వారిపై ఫిర్యాదు చేయలేదని వారు చెప్పారు.