దేశ సరిహద్దుల్లో సైనికుడు, అతని భార్యకు లైంగిక వేధింపులు, ఆత్మహత్య, కామాంధుడు!
బెంగళూరు: దేశంలోని ప్రజలను రక్షించడానికి సుఖ సంతోషాలు త్యాగం చేసి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న సైనికుడికి తీరని అన్యాయం జరిగింది. భార్య బిడ్డకు దూరంగా దేశ భద్రత కోసం పని చేస్తున్న సైనికుడికి ఓ కామాంధుడు తీరని ద్రోహం చేశాడు.
సైనికుడి భార్యను లైంగిక వేధింపులకు గురి చెయ్యడంతో జీవివతంపై విరక్తి పెంచుకున్న ఆమె నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరు గ్రామీణ జిల్లా దేవనహళ్ళి సమీపంలోని విజయపురలో నివాసం ఉంటున్న కవిత (35) భర్త దేశ సరిహద్దుల్లో సైనికుడిగా ఉద్యోగం చేస్తున్నాడు.
కవితకు 7 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కవిత కుమారుడితో కలిసి విజయపురలో నివాసం ఉంటున్నది. విజయపురంకు చెందిన సాయి క్రిష్ణమూర్తి అనే కామాంధుడు కవిత మీద కన్ను వేశాడు. కవితను లైంగిక వేధింపులకు గురి చేశాడు.
చాలసార్లు సాయి క్రిష్ణమూర్తిని కవిత హెచ్చరించింది. అయినా సాయి క్రిష్ణమూర్తిలో ఎలాంటి మార్పురాలేదు. జులై 31వ తేదీ మంగళవారం కవితను సాయి క్రిష్ణమూర్తి తీవ్రస్థాయిలో లైంగిక వేధింపులకు గురి చేసి శారీరకంగా, మానసికంగా వేధించాడు.
లైంగిక వేధింపులు తట్టుకోలేని కవిత జీవితంపై విరక్తి పెంచుకుని మంగళవారం రాత్రి కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కవితను బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై కవిత మరణించిందని బుధవారం పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి సాయి క్రిష్ణమూర్తి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.