‘ట్రిపుల్ తలాక్’పై మార్పు : అప్పుడు రాజీవ్ అలా.. ఇప్పుడు రాహుల్ ఇలా!
ట్రిపుల్ తలాక్పై సుప్రీంకోర్టు మంగళవారం చారిత్రక తీర్పునిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామని రాహుల్ చెప్పారు.
న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్పై సుప్రీంకోర్టు మంగళవారం చారిత్రక తీర్పునిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని, చట్టవ్యతిరేకమని చెబుతూ.. 6నెలల పాటు తలాక్పై సర్వోన్నత న్యాయస్థానం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును దేశంలోని మెజార్టీ రాజకీయ పార్టీలు, ప్రజలు స్వాగతించారు.
స్వాగతించిన రాహుల్
ఈ నేపథ్యంలో రాహుల్ స్పందిస్తూ.. ‘సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం. ట్రిపుల్ తలాక్ చెల్లుబాటు రద్దుతో ముస్లిం మహిళా హక్కులను పునరుద్ఘాటించినట్లయింది. న్యాయం కోసం పోరాడిన మహిళలకు నా అభినందనలు' అని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
Recommended Video
తోసిపుచ్చిన రాజీవ్..
ఇది ఇలావుంటే.. మూడు దశాబ్దాలక్రితం(32ఏళ్ల క్రితం) ఇదే తలాక్ విషయంలో రాహుల్గాంధీ తండ్రి, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. తలాక్ బాధితురాలు షాబానో కేసులో ఆమెకు మద్దతుగా సుప్రీంకోర్టు చెప్పిన తీర్పును తోసిపుచ్చి.. రాజీవ్గాంధీ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు.
వ్యతిరేకతతో ప్రత్యేక చట్టం.. విమర్శలు
భర్త మహ్మద్ అహ్మద్ఖాన్ మూడుసార్లు తలాక్ చెప్పడంతో విడాకులు పొందిన షాబానో బేగం.. భరణం కోసం అతడిపై క్రిమినల్ కేసు పెట్టింది. అయితే ఇస్లాం ప్రకారం తాను ఇద్దత్ కాలానికి మాత్రమే భరణం చెల్లిస్తానని షాబానో భర్త వాదించాడు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు.. షాబానోకు అనుకూలంగా తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పుపై అప్పుడు దేశవ్యాప్తంగా ముస్లింల నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దీంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.. ముస్లింల కోసం 1986లో ముస్లిం ప్రొటెక్షన్ అండ్ డైవర్స్ యాక్ట్ను తీసుకొచ్చింది. ఆ సయమంలో రాజీవ్గాంధీ ప్రధానిగా ఉన్నారు. ఈ చట్టం ప్రకారం.. ఇద్దత్ కాలానికి మాత్రమే భరణం చెల్లిస్తే సరిపోతుంది. దీంతో ముస్లిం మహిళల హక్కులను ప్రభుత్వం కాలరాసిందంటూ రాజీవ్గాంధీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు మొదలయ్యాయి.
కాంగ్రెస్ వైఖరిలో మార్పు..
కాగా, తాజా తీర్పుపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ సానుకూలంగా స్పందించడంతో కాంగ్రెస్ పార్టీ తన ఆలోచనా విధానాన్ని మార్చుకుందంటూ పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, ట్రిపుల్ తలాక్ అంశంపై సుప్రీం తీర్పు పట్ల ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పలువురు బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీ నేతలు కూడా స్వాగతించారు.